కాంగ్రెస్ లో రాజుకుంటున్న తిరుగుబాటు కుంపటి

కాంగ్రెస్ లో రాజుకుంటున్న తిరుగుబాటు కుంపటి
కాంగ్రెస్‌లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటున్నది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బహిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అంగీకరించారు. 
 
ఎమ్మె ల్యే ఫండ్స్‌ విషయం మాట్లాడుకోవాలని భావించామని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీతో చర్చలు జరిపిన తరువాత అన్ని విషయాలు చెప్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. కాంగ్రెస్‌లో అసమ్మతి కుంపటి సెగ అటు అధిష్ఠానాన్ని కూడా తాకింది.
 
పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని హైకమాం డ్‌ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, ఉత్తమ్‌, పొంగులేటి శనివారం కమాండ్‌ కం ట్రోల్‌ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల రహస్యభేటీపై సుదీర్ఘంగా చర్చించారనే విస్తృత ప్రచారం జరుగుతున్నది.

ఒకవైపు మంత్రుల సమావేశం జరుగుతుండగానే, మ రోవైపు నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి మా ట్లాడుతూ పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ ఏమీ కాదని, ఒక ఎమ్మెల్యే డిన్నర్‌ ఇచ్చారని, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు. అంతేకాకుండా, ఆ భేటీని ‘టీ కప్పులో తుఫాన్‌’గా అభివర్ణించారు. కాగా, ఇప్పటికే సీఎంకు, ఒకరిద్దరు మం త్రులకు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు మధ్య పొసగడంలేదనే ప్రచారం జరుగుతున్నది.

వీటికితోడు రసహ్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని, ఏమైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పారు. మరో ఇద్దరు మంత్రులు కూడా రంగంలోకి దిగి సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు.

ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సమాచారం.  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ వద్దకు ఈ అంశం చేరినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆమె కూడా హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం.  రహస్యభేటీలో ఇప్పటివరకు తెరపైకిరాని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తనకూ ‘మెసేజ్‌’ వచ్చిందని, కానీ దానిని తాను చూసుకోలేదని పేర్కొన్నారు.