
ఢిల్లీలో త్వరలో కొత్త వసంతం రాబోతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ఈసారి ఢిల్లీలో బీజేపీదే అధికారమని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఖాతాల్లో రూ.2,500 చొప్పున పడుతాయని హామీ ఇచ్చారు.
ఆర్కే పురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, సంక్షేమ పథకాలను రద్దు చేయబోమని, అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.
ఆరోగ్య రంగంలోనూ ‘ఆపద’ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రజలను దోచుకున్నవారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ హయాంలో రూ.12 లక్షల ఆదాయం ఉంటే నాల్గో వంతు వేతనాన్ని ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వెనక్కి తీసుకునేదని, ఇందిర హయాంలో అయితే రూ.12 లక్షల ఆదాయంపై దాదాపు రూ.10 లక్షలు ట్యాక్స్ రూపంలో పోయేవని ఆయన గుర్తుచేశారు.
పదిపన్నేండేళ్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.12 లక్షలు సంపాదిస్తే రూ.2.60 లక్షలు ట్యాక్స్ రూపంలో ఇవ్వాల్సి వచ్చేదని, బీజేపీ తాజా బడ్జెట్ తర్వాత ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించేవారు కూడా ఒక్క రూపాయి పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రధాని చెప్పారు. సోమవారం వసంత పంచమి వస్తోందని, ఆ తర్వాత వాతావరణంలో మార్పు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీలో అభివృద్ధికి సంబంధించిన కొత్త వసంతం రానుందని చెప్పారు. ఢిల్లీలో ఓటింగ్కు ముందే చీపురు పుల్లలు ఒక్కొక్కటి ఊడిపోతున్నాయని, ఆప్ నాయకులు ఆ పార్టీని వదిలి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
‘వసంత పంచమి తర్వాత వాతావరణంలో మార్పు ప్రారంభమవుతుంది. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 5న ఢిల్లీలో అభివృద్ధికి సంబంధించిన కొత్త వసంతం రానుంది. ఈ సారి దిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. దిల్లీలో ఓటింగ్కు ముందే చీపురు పుల్లలు ఎలా ఊడుతున్నాయో చూస్తున్నాం. ఆప్ నాయకులు ఆ పార్టీని వదిలివెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆప్పై ప్రజలు ఎంత నిరాశతో ఉన్నారో, ఎంత వ్యతిరేకత ఉందో వారికి తెలుసు’ అని మోదీ తెలిపారు.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం