వుమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లోకి యువ భారత్‌

వుమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లోకి యువ భారత్‌

కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన అండర్‌-19 వుమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌లో యువ భారత్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 2న ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనున్నది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఇంగ్లిష్ జట్టును తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా వికెట్‌ నష్టపోయి 15 ఓవర్లలోనే 117 పరుగులు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 

లక్ష్య చేధనలో కమలిని-త్రిష జోడీ టీమిండియాకు మంచి శుభారంభం అందించింది. ఇద్దరు తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలల్పారు. ఫోబ్‌ బ్రెట్‌ బౌలింగ్‌ త్రిష అవుట్‌ అయ్యింది. 29 బంతుల్లో 35 పరుగులు చేసింది. త్రిష తొలి సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. ఆ తర్వాత కమలిని, సానిక చల్కే జోడీ టీమిండియా విజయాన్ని ఖరారు చేశారు. భారత్‌ ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కమలిని 50 బంతుల్లో 56 పరుగులతో రాణించింది. సానికా 12 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. డేవినా పెర్రిన్, కెప్టెన్ అబి నార్గ్రోవ్ తప్ప ఇతర బ్యాటర్స్‌ రాణించలేకపోయారు. పెర్రిన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేయగా, నార్గ్రోవ్ 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసింది. పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మ బంతితో ఆకట్టుకున్నారు. ఇద్దరు చెరో మూడు వికెట్ల పడగొట్టారు. ఆయుషి శుక్లాకు రెండు వికెట్లు దక్కాయి.