
మహిళా సంక్షేమం పేరుతో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాల సునామీ ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్బీఐ హెచ్చరించింది. ఓట్ల కోసం, ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే ఈ తరహా పథకాలను కొన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. ఈ తరహా ఉచిత పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను దాటిందని తెలిపింది.
ఆయా రాష్ట్రాలు ఆర్జిస్తున్న వార్షిక ఆదాయంలో ఈ పథకాల వ్యయం 3 నుంచి 11 శాతానికి సమానంగా ఉందని పేర్కొంది. ఒడిశా లాంటి రాష్ట్రాలు ఈ తరహా పథకాల వ్యయాలను పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయాలను పెంచుకొని, అప్పులను తగ్గించుకున్నాయని ఎస్బీఐ తెలిపింది. ఈ విధంగా ప్రణాళిక రచించుకోని కొన్ని రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను అధిగమిస్తున్నాయని పేర్కొంది.
మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలకు నిధులను కేటాయించగల సామర్థ్యం దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఉందని, అందుకు ఒడిశాను ఉదాహరణగా తీసుకోవచ్చని వెల్లడించింది. ఒడిశాకు పన్నేతర ఆదాయాలు గణనీయంగా వస్తున్నాయని, దాంతో ఆ రాష్ట్రం కొత్తగా అప్పులు చేయడం లేదని నివేదికలో పేర్కొంది.
కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు రూ.2,000 అందిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.28,608 కోట్లు కేటాయిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 11 శాతానికి సమానం. పశ్చిమబెంగాల్లో లక్ష్మీర్ భండార్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.14,400 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 6 శాతానికి సమానం.
ఇక మహిళా సమ్మాన్ యోజన పథకం ద్వారా వయోజన మహిళలకు (కొన్ని వర్గాలకు మినహా) ప్రతినెలా రూ.1,000 చొప్పున అందిస్తామని ఢిల్లీలోని ఆప్ సర్కారు అంటోంది. ఇందుకోసం ఏటా రూ.2,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఢిల్లీ వార్షిక రెవెన్యూ రాబడిలో 3 శాతానికి సమానం. రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు ప్రజాదరణ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తోందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. మహిళల కోసం ఈ విధమైన నగదు బదిలీ పథకాలను ప్రారంభించాలంటూ కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరుగా కాకుండా జాతీయస్థాయిలో సార్వత్రిక నగదు బదిలీ పథకాలను అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. జాతీయస్థాయిలో రూపకల్పన చేసే పథకాల అమలుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమానంగా నిధులను విడుదల చేస్తే బాగుంటుందని పేర్కొంది. సార్వత్రిక నగదు బదిలీ పథకాల అమలుతో రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అడ్డుకట్ట వేయవచ్చని, వాటిపై రాయితీల భారాన్ని తగ్గించవచ్చని ఎస్బీఐ విశ్లేషించింది.
భారీ బడ్జెట్ అవసరమయ్యే నగదు బదిలీ పథకాలను అమలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస అంచనాలు వేసుకోవాలని సూచించింది. ఉచిత హామీలను అమలు చేస్తూ రాష్ట్రాలు ఆర్థిక స్థితిగతులను విస్మరిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్బీఐ హెచ్చరిక చేసింది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!