మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు

మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో మహా కుంభమేళా  కొనసాగుతోంది. 45 రోజులపాటు సాగే ఈ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం మహాకుంభమేళాకు వెళ్లారు.

మహా కుంభ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించిన ఆదిత్యనాథ్, సమావేశం అనంతరం మంత్రులు అందరితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉప ముఖ్యమంత్రులు  కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేశ్‌ పాఠక్‌ సహా కేబినెట్‌ మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. 

సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో ముగుతు. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి త‌గిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం.

బీజేపీ ప్రభుత్వం యూపీ అభివృద్ధిని కొత్త స్థాయికి తీసుకెళ్తుందని యూపీ మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ పునరుద్ఘాటించారు. “ఈ రోజు ప్రయాగ్ రాజ్ లో మంత్రివర్గ సమావేశం ఉంది. మేము ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిని కొత్త స్థాయికి తీసుకెళ్తాము. మా యోగి ప్రభుత్వం యుపి అభివృద్ధి, యుపి యువత, యుపి మహిళల సాధికారత, అనేక ఇతర అంశాలపై కృషి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ను ఉత్తమ్‌ప్రదేశ్‌గా మారుస్తాం’’ అని అన్సారీ పేర్కొన్నారు.

యుపి మంత్రి జైవీర్ సింగ్ మాట్లాడుతూ, “ఇది చారిత్రాత్మకమైన రోజు, 500 సంవత్సరాల పోరాటం, త్యాగాల తరువాత, గత సంవత్సరం ఇదే రోజున, ‘రామ్ లల్లా’ అయోధ్యలో ‘విరాజమానుడు’ అయ్యాడు, ఈ రోజు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికతకు హాజరయ్యే అవకాశం మాకు లభించింది. మహాకుంభం వల్లే ఈ రోజు మనకు ఈ అవకాశం లభించింది ఇక్కడే సమావేశం జరుగుతుందని, ఇందులో ప్రజల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాము’ అని తెలిపారు. 

కాగా, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో భక్తులకు మహాప్రసాదాన్ని వడ్డించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత స్థానిక ఇస్కాన్ క్యాంప్‌ను సందర్శించి భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. సుధామూర్తి తొలుత ఇస్కాన్ వంటశాలకు వెళ్లి అక్కడి వాలంటీర్లతో మాట్లాడారు. మెషీన్లతో భోజన తయారీని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ వద్ద నిలబడి కుంభమేళాకు వచ్చిన భక్తులకు చపాతి, భోజనం వడ్డించారు. ఈ కుంభమేళాను ఆమె తీర్థరాజ్‌గా వణించారు.