* శాఖలపై ఇద్దరు సీనియర్లు రామలింగారెడ్డి, మునియప్ప అసహనం
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ ప్రభుత్వంలో రెండు రోజులకే శుక్రవారం తొలి అంతర్గత అసమ్మతి ఛాయలు కనిపించాయి. సీనియర్ మంత్రి రామలింగారెడ్డి ఇదే అంశంపై రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత, శాఖల కేటాయింపుపై సీనియారిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేహెచ్ మునియప్ప బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం విధానసౌధలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బెంగళూరుకు చేరుకున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెంగళూరుకు చేరుకున్న వెంటనే, శాఖల కేటాయింపులపై తలెత్తుతున్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు.
అంతకుముందు, తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీటీఎం లేఅవుట్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు.రెడ్డి బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించగా, దానికి బదులుగా ఆయనకు భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యతా ఎంపికగా భావించే కృష్ణ బైరే గౌడకు ఆ శాఖ దక్కింది.
రెడ్డి రాజీనామా అనంతరం, గత సిద్దరామయ్య ప్రభుత్వంలో తాను నిర్వహించిన ఆహార, పౌర సరఫరాల శాఖను తిరిగి తనకు కేటాయించడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మునియప్ప కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి బదులుగా, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో మునియప్ప సాంఘిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖను కోరారు.
ముఖ్యంగా, ఎస్సీ వర్గానికి చెందిన ఈ ప్రముఖుడు ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో కూడా ఉన్నారు. కానీ ఆ పదవి చివరికి ఆయన జూనియర్, ఎస్సీ నాయకుడైన జి. పరమేశ్వరకు దక్కింది. విలేకరులతో మాట్లాడుతూ, శాఖల కేటాయింపులో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదని మునియప్ప ఆరోపించారు. “శాఖలను సరిగ్గా కేటాయించడం లేదు. సీనియారిటీని పాటించలేదు. రామలింగారెడ్డి ఎనిమిది సార్లు గెలిచారు. నేను ఎనిమిది సార్లు గెలిచాను… దీనిని వారు సమతుల్యంగా చూసి ఉండాల్సింది,” అని ఆయన పేర్కొన్నారు.
సీఎం శివకుమార్ కేటాయించిన శాఖను స్వీకరించేందుకు రామలింగారెడ్డి తిరస్కరించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చారని, బెంగుళూరు పట్టణాభివృద్ధి శాఖను అప్పగిస్తానన్నారని, సీఎంను తాను ఏ పదవీ అడగలేదని, ఆయన స్వంతంగా ఆ ఆఫర్ చేశారని, కానీ ఆ తర్వాత నీటిపారుదల శాఖను అప్పగించడం తనకు ఇష్టం లేదని రామలింగారెడ్డి తెలిపారు.
“నేను నా మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయలేను. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా” అని స్పష్టం చేశారు. ఈ పరిణామంపై స్పందిస్తూ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించడమే కాకుండా, సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.రెడ్డిని “సీనియర్ నాయకుడు, సన్నిహిత మిత్రుడు” అని పేర్కొన్న శివకుమార్, “మేము దీనిని పరిష్కరించుకుంటాం” అని తెలిపారు.
అయితే, రెడ్డి తన ధృడ వైఖరిని స్పష్టం చేస్తూ, ఒకవేళ ఇప్పుడు ‘బెంగళూరు అభివృద్ధి’ శాఖను ఆఫర్ చేసినా తాను దానిని స్వీకరించబోనని తేల్చి చెప్పారు.తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.గురువారం రాత్రి సీఎం డీకే శివకుమార్ 13 మంది మంత్రులకు శాఖను కేటాయించారు. బెంగుళూరు డెవలప్మెంట్ శాఖ కోసం రామలింగారెడ్డి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న బెంగళూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామలింగారెడ్డి వంటి సీనియర్ నేత అసంతృప్తి పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
More Stories
కొత్త రాజకీయ ఉద్యమానికి అన్నామలై శ్రీకారం
రాజేష్ ఎక్సపోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల మాయాజాలం
పౌరుల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించాలి