మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు

మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి నిత్యం కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారు. 12 కుంభమేళాలకు ఒకసారి అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగనుండగా, పెద్ద ఎత్తున భక్తులు, సాధువులు విచ్చేస్తున్నారు. ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. 
 
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహా కుంభమేళా సాగనుంది. మహా కుంభమేళా తాత్కాలికంగా 12 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని అంచనా వేస్తున్నారు.  మహా కుంభమేళాతో ప్రస్తుతం కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతున్న ప్రయాగ్‌రాజ్‌.. 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్‌ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ తాజాగా అంచనా వేసింది. 
 
ఈ 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు మొత్తం 8 లక్షల మందికి ఉపాధిని అందించనున్నాయని పేర్కొంది. అనేక రంగాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆ సంస్థ సీఈఓ సచిన్ అలగ్‌ ఈ లెక్కలు వేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్థికవృద్ధి, తాత్కాలిక ఉపాధి కల్పన జరుగుతుందని సచిన్ అలగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఈ ప్రభావం ఆ రాష్ట్రంలోని పలు రంగాలపై కనిపిస్తుందని సచిన్ అలగ్ వివరించారు. కేవలం పర్యాటకం, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపారు. హోటల్‌ స్టాఫ్, టూర్ గైడ్లు, పోర్టర్లు, ట్రావెల్‌ కన్సల్టెంట్లు, ఈవెంట్‌ కో-ఆర్డినేటర్లుగా లక్షల మందికి పని దొరుకుతుందని చెప్పారు. 
 
ఇక రవాణా రంగంలో డ్రైవర్లు, సప్లై చైన్ మేనేజర్లు, ఇతర సర్వీసులు అందించేందుకు మరో 3 లక్షల మంది అవసరం ఉండొచ్చని పేర్కొన్నారు. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడికల్, ఇతర మెడికల్ సిబ్బందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు.  మరోవైపు, టెక్నాలజీ రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొంది. 
 
దర్శన్‌ యాప్స్‌, రియల్ టైం ఈవెంట్ అప్‌డేట్ ప్లాట్‌ఫామ్స్‌, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలు అందించేందుకు సుమారు 2 లక్షల మంది అవసరం ఉండటంతో ఐటీ రంగ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని సచిన్ అలగ్ తెలిపారు. ఆహార ఉత్పత్తులు, ప్రసాదాలు కొనేవారి సంఖ్య భారీగా పెరగడంతో సుమారు మరో లక్ష మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు.