కుంభమేళాలో ఆకట్టుకుంటున్న శ్రీవారి నమూనా ఆలయం

కుంభమేళాలో ఆకట్టుకుంటున్న శ్రీవారి నమూనా ఆలయం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి నమూనా ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల తరహాలో తిరుప్పావై సేవ, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. భక్తులను స్వామివారి ప్రసాదాలు వితరణ చేశారు. వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు.

శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించడానికి వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒక రూపాయి నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని టీటీడీకి విరాళంగా ఇవ్వవచ్చు.

ఈనెల 18వ తేదీన ఉద 11 నుంచి 12 గంటలకు శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.