100 `నాసిరకపు’ పారిస్‌ ఒలింపిక్‌ పతకాలు వాపస్

100 `నాసిరకపు’ పారిస్‌ ఒలింపిక్‌ పతకాలు వాపస్
పారిస్‌ ఒలింపిక్‌ పతకాలు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి. విశ్వక్రీడలు ముగిసి ఏడాది కూడా పూర్తికాకుండానే చాలావరకు పతకాలపై ఉన్న లోహపు పూత చెదిరిపోయి, అవి నాసిరకంగా దారుణంగా తయారయ్యాయి. ఇప్పటికే పతకాల్లో లోపాలను గమనించి 100 మంది అథ్లెట్లు వాటిని వాపస్‌ చేశారు. 
 
దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ స్పందిస్తూ లోపభూయిష్టంగా ఉన్న 2024 ఒలింపిక్‌ పతకాలను మార్చి కొత్తవి ఇస్తామని ఆంగ్ల వార్త సంస్థ ఏఎఫ్‌పీకి వెల్లడించింది. ”ది పారిస్‌ 2024 ఒలింపిక్‌ గేమ్స్‌ నిర్వాహక కమిటీ ఫ్రెంచ్‌ ప్రభుత్వ మింట్‌తో కలిసి పనిచేస్తోంది. ఆ సంస్థే పతకాల తయారీ, నాణ్యతకు బాధ్యత వహిస్తుంది. 
 
మెడల్స్‌పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి.. లోపభూయిష్టంగా ఉన్న వాటిని ఫ్రెంచి ప్రభుత్వ మింట్‌ రీప్లేస్‌ చేస్తుంది. ఈ ప్రక్రియ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది” అని వివరించింది.  మరోైపు ఫ్రెంచి ప్రభుత్వ మింట్‌ మాత్రం ఇవి నాసిరకంగా ఉన్నాయని వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది. గత ఆగస్టు నుంచే లోపాలను ఉన్న పతకాలను మార్చి ఇచ్చామని పేర్కొంది. 
 
ఇప్పటివరకు దాదాపు 100 అథ్లెట్లు వాటిని వాపస్‌ చేసినట్లు లా లెట్రె పత్రిక పేర్కొంది. మరికొందరు అథ్లెట్లు సోషల్‌ మీడియాలో వాటి ఫొటోలు పోస్టు చేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన స్కేట్‌ బోర్డర్‌ హుస్టన్‌ అయితే వీటి నాణ్యతపై ఫిర్యాదు చేశారు.  ఈ ఒలింపిక్స్‌లో 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అథ్లెట్లకు ఇచ్చారు. 
 
వీటిని విలాసవంతమైన నగలు తయారుచేసే చౌమెట్‌ సంస్థ డిజైన్‌ చేసింది. ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచిన అథ్లెట్‌కు స్వర్ణ పతకం బహుమతిగా ఇస్తారు. దీన్ని పూర్తిగా బంగారంతో చేయరు. వెండితో రూపొందించారు. పైన బంగారు పూత పోశారు. అథ్లెట్లకు ప్రదానం చేసే స్వర్ణ పతకంలో 92.5 శాతం వెండి ఉంది. 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. 
 
2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో విజేతకు ఇచ్చే స్వర్ణం విలువ రూ.62 వేల నుంచి 71 వేల మధ్య విలువ ఉంటుంది. ఇక పూర్తిగా వెండి మాత్రమే ఉపయోగించే రజత పతకం విలువ సుమారు రూ.37 వేలు పలుకుతుంది. కాంస్య పతకాన్ని 95 శాతం రాగి.. 5 శాతం జింక్‌ మేళవింపుతో రూపొందించారు. దీని తయారీ విలువ రూ.500 ఉంటుంది. ఈసారి పతకాల్లో ఈఫిల్‌ టవర్‌ నుంచి తీసిన ఉక్కును కలిపారు. 
 
అయితే ఈ పతకాల తయారీ ఖర్చు ఎంత అయినప్పటికీ విలువ అమూల్యమే. కానీ సాధించిన ఘన విజయాలకు ప్రతీకగా ఉండే పతకాలు ఏడాది కూడా కాకముందే నాసిరకంగా మారుతుండటంతో … వాటిని అథ్లెట్లు వాపస్‌ చేస్తున్నారు.