నేనేం దేవుడిని కాదు, సాధారణ మనిషినే.. తప్పులు చేసాను 

నేనేం దేవుడిని కాదు, సాధారణ మనిషినే.. తప్పులు చేసాను 
తన వల్ల కూడా కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ‘నేనేం దేవుడిని కాదు, సాధారణ మనిషినే” అంటూ వ్యాఖ్యానించారు. తొలిసారి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే తొలిసారి అని దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో కూడా తెలియదంటూనే.. తన రాజకీయాల ప్రస్థానం గురించి వివరించారు మోదీ.

ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు అయిన నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న “పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్” అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పీపుల్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ ఎపిసోడ్ 6 ట్రైలర్ అంటూ… హోస్ట్‌గా వ్యవహరించిన నిఖిల్ కామత్ ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 
 
ఆ వీడియో మొత్తం 2 నిమిషాల 13 సెకన్లు ఉండగా, అనేక విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా రాజకీయాలతో పాటు వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి అనేక అంశాలపై మాట్లాడారు.  ట్రైలర్ ప్రారంభంలోనే హోస్ట్ నిఖిల్ కామత్ మాట్లాడుతూ “ప్రధానిని ఇంటర్వ్యూ చేయాలంటే తనకు భయంగా ఉంది” అని చెప్పారు.
 
ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిస్తూ “ఇదే నా తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ. ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారో తెలియదు” అంటూ చెప్పగా ఇద్దరిలోనూ నవ్వులు విరిసాయి. అలాగే తాను హిందీ సరిగ్గా మాట్లాడకపోతే క్షమించాలంటూ నిఖిల్ కోరగా, మోదీ నవ్వుతూ బదులిచ్చారు.  ఆ తర్వాత యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎలాంటి ప్రతిభ ఉండాలని నిఖిల్ ప్రధానిని అడగ్గా, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మోదీ చెప్పారు.  ప్రజా సేవ చేయాలన్న ఆశయంతో రావాలి కానీ, సొంత లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కాదని ప్రధాని మోదీ వివరించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూనే తాను ముఖ్యమంత్రి అయినప్పుడు తన వల్ల కూడా కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. “నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో విషయమై అసమంజసంగా మాట్లాడాను. పొరపాట్లు జరుగుతాయి. నేను మానవ మాత్రుడిని. దేవుడిని కాదు” అంటూ ప్రధాని చెప్పుకొచ్చారు.
 
రాజకీయాల పట్ల ప్రజలలో నెలకొన్న ప్రతికూల అభిప్రాయాలను ప్రస్తావిస్తూ నిఖిల్ ఈ విధంగా చెప్పారు. “నేను దక్షిణ భారత మధ్య తరగతి కుటుంభంలో పేరుగాను. రాజకీయాలు అంటే బురదతో ఆడుకోవడంగా మాకు ఎపుడు చెబుతూ ఉండేవారు. మానసికంగా ఈ అభిప్రాయం మాలో ఎంతగా నాటుకు పోయింది అంటే దానిని మార్చుకోవడం దాదాపు అసంభవం. ఆ విధంగా భావించే వారికి మీ సలహా ఏమిటి” అని ప్రధానిని ప్రశ్నించారు.
 
“మీరు చెప్పిన దానిలో మీరు విశ్వసిస్తూ ఉన్నట్లయితే మన మధ్య ఈ సంభాషణ జరిగి ఉండెడిది కాదు” అని ప్రధాని మోదీ తెలిపారు.  ప్రస్తుతం ప్రపంచం మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి.. దీనిపై మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటారా? అని నిఖిల్ ప్రశ్నించగా నరేంద్ర మోదీ నవ్వుతూ బదులిచ్చారు.

నిఖిల్ కామత్ షేర్ చేసిన ఈ వీడియోను ప్రధాని మోదీ రీపోస్ట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూను చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నానంటూ రాసుకొచ్చారు. రెండు సార్లు ప్రధాన మంత్రిగా భారతదేశానికి సేవలు అందించిన అనుభవాలను అందరితో పంచుకున్న ఈ ఇంటర్వ్యూను చూసేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పుడు ఈ పూర్తి ఇంటర్వ్యూ వస్తుందని గూగుల్‌లో సెర్చ్ చేసేస్తున్నారు.