ఇక ఎయిర్‌ ఇండియా విమానాల్లోనూ వైఫై సేవలు

ఇక ఎయిర్‌ ఇండియా విమానాల్లోనూ వైఫై సేవలు
దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ350, బోయింగ్‌ 757-9, ఎంపిక చేసిన కొన్ని ఎయిర్‌బస్‌లు, ఎ321 నియో విమానాలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో వైఫై ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఎయిర్‌ ఇండియా బుధవారం ప్రకటించింది. 
 
దేశీయ విమాన సర్వీసులలో వైఫై ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందజేయడం ఇదే మొదటిసారి. ఈ ఘనత టాటా గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఇండియాకు దక్కింది. అంతర్జాతీయ విమానాలలో వైఫై సర్వీసులను విస్తారా గత ఏడాది జూలైలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది. నవంబర్‌లో విస్తారా ఎయిర్‌ ఇండియాలో విలీనమైంది.

భారతీయ గగనతలంలో 10,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానంలో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగించడానికి అనుమతించినపుడు వైఫై ద్వారా మాత్రమే విమానంలోని ప్రయాణికులు ఇంటర్నెట్‌ సర్వీసులను వాడడం సాధ్యమవుతుందని టెలికం శాఖ నవంబర్‌లో ప్రకటించింది.

అంతర్జాతీయ విమానాలలో వైఫై సర్వీసులను అమలు చేస్తున్న నేపథ్యంలో దేశీయ విమానాలలో కూడా వైఫై ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఎయిర్‌ ఇండియా గ్రూపులో ప్రస్తుతం దాదాపు 300 విమానాలు ఉన్నాయి. వీటిలో ఎయిర్‌ ఇండియాతోపాటు తక్కువ చార్జీలతో నడిచే దాని అనుబంధ ఎయిర్‌లైన్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనమైంది. తర్వాత విస్తారా సైతం విలీనమైంది.