నింగిలోకి విజయవంతంగా పీఎస్‌ఎల్వీ-సీ60

నింగిలోకి విజయవంతంగా పీఎస్‌ఎల్వీ-సీ60
* శ్రీహరికోట నుంచి 100 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్‌(స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌) ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది. సోమవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్‌ప్యాడ్‌ నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌(పీఎస్‌ఎల్వీ)-సీ60 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనితో- తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం చరిత్ర సృష్టించబోతోంది. 100 ప్రయోగాలను పూర్తి చేసుకున్నట్టవుతుంది.
 
ఎస్‌డీఎక్స్‌01(చేజర్‌), ఎస్‌డీఎక్స్‌02(టార్గెట్‌) అనే రెండు చిన్న ఉపగ్రహాలను ఈ వాహకనౌక నిర్ణీత భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఒక్కో ఉపగ్రహం 220 కిలోల బరువు ఉంది. ఐదు కిలోమీటర్ల దూరం ఉండేలా వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ రెండింటినీ 3 మీటర్ల సమీపానికి చేర్చి డాకింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో మరో 24 పేలోడ్‌లను సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటిల్లో 14 ఇస్రో, డీఓఎస్‌కు చెందినవి కాగా, 10 పేలోడ్లు ప్రభుత్వేతర సంస్థవి. కాగా, సోమవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగం ప్రారంభించాల్సి ఉన్నా అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యమై 10 గంటల 15 సెకన్లకు ప్రారంభమైంది. 

ఇస్రోకు ఇది 99వ ప్రయోగం. పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ఉపగ్రహాలను వాహకనౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. డాకింగ్‌ ప్రక్రియకు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇస్రో చేపట్టబోతున్న భవిష్యత్‌ ప్రయోగాలకు డాకింగ్‌ సామర్థ్యం అత్యంత కీలకం. 

చంద్రుడి పైకి వ్యోమగాములను పంపడానికి, చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలను భూమి పైకి తీసుకురావడానికి డాకింగ్‌ సామర్థ్యం అవసరం. భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్‌) ఏర్పాటుకు, అంతరిక్షానికి భారత్‌ నుంచి మొదటి వ్యోమగామిని పంపించడానికి చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రయోగానికి సైతం డాకింగ్‌ అవసరం. స్పేడెక్స్‌ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్‌ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.

ఏమిటీ స్పేడెక్స్‌ ప్రయోగం?

అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్‌, అన్‌డాకింగ్‌ సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ స్పేడెక్స్‌ ఉద్దేశం. అంతరిక్షంలో వేరుగా ఉన్న రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడాన్ని డాకింగ్‌ అంటారు. ఇలా డాకింగ్‌ చేసినప్పుడు రెండింటి మధ్య విద్యుత్తు లేదా ఇంధనాన్ని బదిలీ చేయడానికి, వ్యోమగాములు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. డాకిం గ్‌ ప్రక్రియ ద్వారా రోబోటిక్‌ ప్రయోగాల్లో ఉపగ్రహాల సర్వీసింగ్‌కు, ఇం ధనాన్ని నింపడానికి, ఉపగ్రహ జీవితకాలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఉపగ్రహాలను వేరు చేయడాన్ని అన్‌డాకింగ్‌ అంటారు.

కాగా, జనవరిలో నేవిగేషన్ శాటిలైట్ (ఎన్‌వీఎస్) 2 ను శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. గతంలో చేపట్టిన ఎన్‌వీఎస్ 1కు కొనసాగింపుగా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించబోతోన్నామని, జనవరిలో ఈ ప్రయోగం ఉంటుందని చెప్పారు.

దీనికోసం జియోసింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ఉపయోగిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన తుది ఏర్పాట్లు పూర్తవుతున్నాయని అన్నారు. 2025లో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టబోతోన్నామని, ఎన్వీఎస్ 2తో బోణీ చేస్తామని సోమ్‌నాథ్ తెలిపారు.