జమ్మూ కశ్మీర్‌లో భారీ హిమపాతం

జమ్మూ కశ్మీర్‌లో భారీ హిమపాతం

* రైలు, విమానాలు సేవలతో పాటు రహదారులూ బంద్!

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో దట్టమైన మంచు కురుస్తుంది. డిసెంబర్ 21వ తేదీన ప్రారంభమైన శీతాకాలంతో కాలు పెడితే చాలు మోకాళ్ల లోతు వరకు మంచు చేరుతోంది.  శ్రీనగర్, దోడా, పుల్వామా, అనంత్‌నాగ్‌, బారాముల్లా, సోనమార్గ్‌, బందిపోర, పూంచ్, రాజౌరి సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి.
 
దీని వల్ల శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. దీంతో అటు రైలు, విమానాల సేవలను అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ ప్రధాన రహదారిపై కూడా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడంతో.. రహదారిని సైతం బంద్ చేశారు.  కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హిమపాతం కురిసింది. దీంతో అక్కడి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
శ్రీనగర్, కశ్మీర్ లోయలోని మైదాన ప్రాంతాల్లో శుక్రవారమే హిమపాతం ప్రారంభం కాగా.. రెండో రోజే దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లోనే కూర్చుంటున్నారు. మరీ అత్యసవరం అయితే తప్ప అడుగు బయట పెట్టలేకపోతున్నారు.  దక్షిణ కశ్మీర్, మధ్య కశ్మీర్ మైధానాల్లో భారీ స్థాయిలో హిమపాతం కురవగా కశ్మీర్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా మంచు కురిసింది. 
 
శ్రీనగర్‌లో దాదాపు 8 అంగుళాల వరకు మంచు పేరుకు పోగా గందర్‌బల్, సోనామార్గ్‌లో 7-8 అంగుళాల హిమపాతం నమోదు అయింది. అలాగే శ్రీనగర్-లేహ్ హైవేపై 15 అంగులాళ మంచు కురవగా, అనంత్‌నాగ్ జిల్లా అనేక ప్రాంతాల్లో 17 అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. పహల్గామ్, పుల్వామా, షోపియాన్ వంటి ప్రాంతాల్లో కూడా గణనీయమైన స్థాయిలో హిమపాతం కురిసింది.
 
ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్-44)పై భారీగా మంచు పేరుకుపోవడంతో రోడ్డును మూసివేశారు. అలాగే మంచును తొలగించి రహదారిని శుభ్రం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బనిహాల్-బారాముల్లా మధ్య ఉన్న రైలు సేవలను నిలిపివేశారు. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో శ్రీనగర్ నుంచి బయటకు వచ్చే విమానాల రాకపోకలను బంద్ చేశారు. 
 
శనివారం ఒక్కరోజే దాదాపు 80 శాతం విమానాలు రద్దు చేశారు. భారీ హిమపాతం కారణంగా లోయ అంతటా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 33 కేవీ స్థాయిలో 41 ఫీడర్లు, 11 కేవీ స్థాయిలో 739 ఫీడర్లు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.  అంతేకాకుండా ఇప్పటికే పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినట్లు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. అన్ని సేవలు నిలిపివేసినా ఆస్పత్రులకు వెళ్లే రహదారులను మాత్రం ముందుగా క్లియర్ చేస్తున్నారు.
 
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్‌ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున
 
్నాయి. మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్‌ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ప్రముఖ దాల్‌ సరస్సు సహా పలు నదులు గట్టకట్టుకుపోయాయి.
 
కాగా, మంచు తుఫానును ఎదుర్కోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. “ఈ ప్రాంతంలో రోడ్లను క్లియర్ చేస్తున్నారు. సీనియర్ అధికారులు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు” అని ఒక అధికారి తెలిపారు. 
 
డిసెంబర్ 29-31 వరకు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని, జనవరి 1-5 వరకు కాశ్మీర్‌లోని ఏకాంత ప్రదేశాలలో తేలికపాటి హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వరకు ఉష్ణోగ్రతలు కొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాను జమ్మూ నుండి శ్రీనగర్‌కు కారులో వెళ్లానని, దాదాపు 2,000 వాహనాలు మంచులో చిక్కుకున్నాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.