మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కు కన్నీటి వీడ్కోలు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కు కన్నీటి వీడ్కోలు
భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌనమునికి అంతిమ వీడ్కోలు పలికారు.
 
డిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులో మన్మోహన్‌ సింగ్‌ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలైంది. 
 
సంస్కరణలతో దేశార్థికాన్ని నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ భారతావని శుక్రవారం కన్నీటి నివాళులర్పించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులు ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశానికి మన్మోహన్‌ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. 
 
ఈ క్రమంలో బోద్ నిగమ్ ఘాట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఆ సమయంలో మూడు సైన్యాలు మాజీ ప్రధానికి సెల్యూట్ చేశాయి. ఆ క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని త్రివర్ణ పతాకంతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ బోద్, జేపీ నడ్డా సహా పలువురు నేతలు హాజరై నివాళులు అర్పించారు.

ఆర్మీ ఫిరంగి రైలులో పార్థివ దేహాన్ని నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. రాహుల్ గాంధీ మృతదేహంతో వాహనంలో కూర్చుని అక్కడకు వచ్చి నివాళులు అర్పించారు. ఘాట్ వద్ద కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరై నివాళులర్పించారు. 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల నిమిత్తం భూటాన్ రాజు, మారిషస్ విదేశాంగ మంత్రి భారత్ చేరుకున్నారు. అంతకుముందు శుక్రవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా దేశంలోని నాయకులందరూ ఆయన నివాసంలో నివాళులర్పించారు.

జో బైడెన్ సంతాపం
మన్మోహన్ సింగ్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని బైడెన్ కొనియాడారు. మాజీ ప్రధాని సతీమణి గురుశరణ్ సింగ్, కుటుంబసభ్యులకు బైడెన్‌ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు వైట్‌ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.