మహిళల భద్రతపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

మహిళల భద్రతపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

నిర్భయ 12వ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, లింగమార్పిడి వ్యక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి పాన్‌ ఇండియా మార్గదర్శకాలను రూపొందించడానికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై కేంద్రం, వివిధ మంత్రిత్వశాఖలకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్‌ను పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది. 

జస్టిస్‌ సూర్యకాంత్‌, ఉజ్జల్‌, భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్‌ కార్యాలయం ద్వారా సంబంధిత మంత్రిత్వశాఖలకు, ఆర్గనైజేషన్‌లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది మహాలక్ష్మీ పావని మాట్లాడుతూ.. ‘చిన్న చిన్న నగరాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని, వాటిని నివేదించలేదు. ఇటీవల కలంలో కలకత్తాలోని ఆర్‌జికర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ట్రైనీ విద్యార్థినీ హత్యాచారానికి గురైంది. ఈ ఘటన తర్వాత దాదాపు 95 లైంగిక హింస సంఘటనలు జరిగాయి. కానీ అవేవీ హైలెట్‌ కాలేదు’ అని తెలిపారు. 

నేరస్తులకు స్కాండినేవియన్‌ (ఉత్తర ఐరోపా) దేశాల్లో చేసిన విధంగా కెమికల్‌ క్యాస్ట్రేషన్‌ (సెక్స్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఆపడానికి రసాయనాలు లేదా మందులు వాడకం) వంటి శిక్షలు విధించాలిని ఆమె డిమాండ్‌ చేశారు. రోజూ ఏదో ఒక విధంగా సామాన్య మహిళ ఎదుర్కొనే వేధింపులకు ఉపశమనం కలిగించేలా ప్రయత్నిస్తున్నందుకు జస్టిస్‌ సూర్యకాంత్‌ పావనిని అభినందించారు. 

ఈ సందర్బంగా పిటిషన్‌లో పేర్కొన్న ‘అనాగరికం’, ‘కఠినం’ అన్న పదాలని, లేవనెత్తిన అంశాలు వినూత్నంగా ఉన్నాయని, వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ కాంత్‌ తెలిపారు. పబ్లిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలనేదానిపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని బెంచ్‌ అభిప్రాయపడింది.

బస్సుల్లో, మెట్రో, రైళ్లలో చేయదగిన పనులు, చేయకూడని వాటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని బెంచ్‌ అభిప్రాయపడింది. 2012లో ఢిల్లీలో డిసెంబర్‌ 16వ తేదీన 23 ఏళ్ల ఫిజియోథెరపిస్టుపై బస్సులో సామూహిక అత్యాచారం జరిగిందని, ఇది దేశవ్యాప్తంగా సంచలనమైందని పావని బెంచ్‌కి తెలిపారు. 

చాలా కేసుల్లో పలు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అవి అమలవుతున్నాయా?  అని ఆమె ప్రశ్నించారు.  చట్టాల అమలులో ఎక్కడ లోపం జరుగుతుందో పరిశీలించాల్సిన అవసరం ఉందని సూర్యకాంత్‌, జ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది.