ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి

ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ ఆదేశాలు..!

 గుజరాత్‌ జీఎంఈఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ భూతానికి ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థి మృతి చెందాడు. వసతి గృహం లో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో కోమాలోకి మృతి చెందినట్లుగా కేసు నమోదైంది. ఈ క్రమంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్ఎంసి) దేశంలోని మెడికల్‌ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ర్యాగింగ్‌ను నిరోధించేందుకు ఎప్పటికప్పుడు నిబంధనలు అమలు చేస్తున్నామని, అయితే, క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని కమిషన్‌ చైర్మన్‌ మెడికల్‌ కాలేజీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా పలు నివేదికల ద్వారా ర్యాగింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. 

అన్ని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలు ర్యాగింగ్ ఫిర్యాదులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ చైర్మన్‌ ఆదేశించారు. గుజరాత్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన చాలా దారుణమని చైర్మన్ డాక్టర్ విజయ్ ఓజా ఉదాహరించారు. ఇలాంటి ర్యాగింగ్‌ ఘటనలు విద్యాసంస్థల ప్రతిష్టను దిగజార్చుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

మానసిక వేధింపులు, ఆత్మహత్యలకు దారితీసే కేసులు ఉన్నాయని చైర్మన్ తెలిపారు. ఎన్‌ఎంసీ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌, యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఈ విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల గుజరాత్‌ ధర్‌పూర్‌లోని జీఎంఈఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ 18 సంవత్సరాల వైద్య విద్యార్థి మృతి చెందాడు. 

వసతి గృహంలో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో మొదటి సంవత్సరం విద్యార్థి అనిల్‌ మెథానియా అచేతన స్థితిలోకి వెళ్లి మరణించాడని ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వాళ్లు మమ్మల్ని మూడు గంటలపాటు నిలబడి పరిచయం చేసుకోవాలని, ఆందోళన చేయకూడదని ఒత్తిడిచేశారని, చివరికి మాతోపాటు నిలబడిన ఓ విద్యార్థి పడిపోయాడని, మేం అతడిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 15 మందిపై కేసు నమోదైంది.