జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో సోనియా!

జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో సోనియా!
అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. ఈ బృందం స్వతంత్ర కాశ్మీర్ ఆలోచనకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. భారతదేశ అంతర్గత వ్యవహారాలపై విదేశీ సంస్థల ప్రభావాన్ని ఈ బంధం వెల్లడిస్తోంది ఎక్స్ పోస్ట్‌లలో బిజెపి పేర్కొంది.
 
  ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌కు కో-ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా గాంధీ, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించే సంస్థతో అనుసంధానించబడ్డారు. ముఖ్యంగా,  ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్ కాశ్మీర్‌ను ప్రత్యేక సంస్థగా పరిగణిస్తున్నట్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసింది, ” అని బిజెపి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
 
 సోనియాగాంధీకి, కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా భావించే సంస్థకు మధ్య ఉన్న ఈ అనుబంధం భారతదేశ అంతర్గత వ్యవహారాలపై విదేశీ సంస్థల ప్రభావాన్ని, అలాంటి సంబంధాల రాజకీయ ప్రభావాన్ని తెలియజేస్తుందని బిజెపి ఆరోపించింది. మరో ‘ఎక్స్’ పోస్ట్ లో, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఛైర్‌గా ఉన్న సోనియా గాంధీ జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నారని బిజెపి ఆరోపించింది.
 
ఇది భారతీయ సంస్థలపై విదేశీ నిధుల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. “అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన  ఓసీసీఆర్‌పీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిని గాంధీ అదానీని విమర్శించడానికి ఒక సాధనంగా ఉపయోగించారు. ఇది వారి బలమైన, ప్రమాదకరమైన సంబంధాన్ని తప్ప మరేమీ చూపదు” అని ఆ పోస్ట్ పేర్కొన్నది. దీనిని బట్టే జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన సంబంధం, భారత ఆర్థిక వ్యవస్థను పట్టాలు తప్పించే ప్రమాదకరమైన యోచన అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది.

”సోనియాగాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసింది. భారతదేశ సంస్థలపై విదేశీ నిధుల ప్రభావాన్ని ఇలాంటి అంశాలు అద్దంపడతాయి. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో ఆయనతో కలిసి సోరోస్-ఫండెడ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ షెట్టి పాల్గొన్నారు” అని బీజేపీ తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం జార్జ్ సోరోస్ తమ పాతమిత్రుడని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేసింది.

ఇదిలావుండగా, భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు మద్దతుగా బిజెపి వాదనలను అమెరికా తిరస్కరించినప్పటికీ, బిజెపి ఎంపి నిషికాంత్ దూబే లోక్‌సభలో రాహుల్ గాంధీని ప్రశ్నించే ప్రణాళికలను ప్రకటించారు.  ఓసీసీఆర్‌పీ, జార్జ్ సోరోస్ ప్రతిపక్షాలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ఒక ఎక్స్ పోస్ట్‌లో దుబే ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఆరోపించారు.
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో బిజెపి ఎంపి మాట్లాడుతూ, “నిన్న నేను యుఎస్ ఎంబసీ అధికారుల ప్రకటనను మళ్లీ మళ్లీ చదివాను. అమెరికా ప్రభుత్వం ఓసీసీఆర్‌పీకు నిధులు సమకూరుస్తుందని, సోరోస్ ఫౌండేషన్ కూడా నిధులు సమకూరుస్తుందని వారు అంగీకరించారు.  ఓసీసీఆర్‌పీ, సోరోస్ పని భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, ప్రతిపక్ష నాయకులతో కలిసి మోదీ ప్రభుత్వం పరువు తీయడం. ఈ ప్రకటన తర్వాత, నేను రాహుల్ గాంధీని లోక్‌సభలో నేను 10 ప్రశ్నలను అడగాలి. పార్లమెంటులో నా గొంతును అణిచివేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. లోక్‌సభ నిబంధన 357 నాకు ప్రశ్నలు అడిగే హక్కును ఇస్తుంది. రేపటి కోసం వెయిట్ చేస్తున్నాను” అని ఆదివారం ప్రకటించారు.