సరిహద్దుల్లో శాంతి లేకుండా చైనాతో సంబంధాలు మెరుగు పడలేవు

సరిహద్దుల్లో శాంతి లేకుండా చైనాతో సంబంధాలు మెరుగు పడలేవు
సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా భారత్ – చైనా సంబంధాలు సాధారణంగా ఉండలేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
 
భారత్-చైనా సరిహద్దు సమస్యకు న్యాయమైన, సరైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకురావడానికి ద్వైపాక్షిక చర్చల ద్వారా చైనాతో సంప్రదింపులు జరపడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన లోక్‌సభకు తెలిపారు. 2020 ఏప్రిల్- మేనెలల్లో తూర్పు లఢఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా సైనికులను మోహరించారు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లోని వివిధ పాయింట్ల వద్ద చైనా తమ దళాలను భారీగా మోహరించింది. 
 
ఈ క్రమంలోనే సరిహద్దుల్లో పెట్రోలింగ్‌కు అడ్డు కలిగించిందని జై శంకర్ తెలిపారు. ఎన్నో లాజిస్టిక్ సవాళ్లు, కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ భారత సైన్యం వేగంగా, సమర్థవంతంగా.. చైనా సైన్యాన్ని అడ్డుకుని, వారిని ప్రతిఘటించిందని చెప్పారు. ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని ఏర్పాటు చేసేందుకు దౌత్యచర్చలు అవసరమని జై శంకర్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే సరిహద్దు రక్షణ సహకారంపై రెండు దేశాలు ఒక అవగాహనకు రావడానికి 1991, 1993, 1996, 2003, 2005, 2012, 2013లో చేసుకున్న ఒప్పందాలను జైశంకర్ గుర్తు చేశారు. తాజాగా ఇటీవల జరిగిన డెప్సాంగ్, డెమ్‌చోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు సంబంధించి జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు.