బెయిల్ ఇచ్చిన తెల్లారే మంత్రి పదవా?.. సుప్రీం విస్మయం

బెయిల్ ఇచ్చిన తెల్లారే మంత్రి పదవా?.. సుప్రీం విస్మయం
అవినీతి కేసులో బెయిల్‌పై విడుదలైన డీఎంకే నేత సెంథిల్‌ బాలాజీ కొద్ది గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతున్నదని ప్రశ్నించింది. ఈ చర్య బాధితులను ఒత్తిడికి గురిచేస్తుందని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

డీఎంకే నేతకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సెంథిల్ బాలాజీ బెయిల్ ఆర్డర్ ఉపశమనం కోరే ఇతరులకు ప్రయోజనం చేకూర్చింది కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోవడానికి బెంచ్ నిరాకరించింది. బాలాజీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన సాక్షులు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే దానికే పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు పేర్కొంది.

`మేము బెయిల్ మంజూరు చేసిన వెంటనే మీరు వెళ్లి మంత్రి అవుతారు. ఇప్పుడు సీనియర్ క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న మిమ్మల్ని చూసి సాక్షులు కచ్చితంగా ఒత్తిడికి లోనవుతారు. అసలు ఏం జరుగుతోంది’ అని కోర్టు ప్రశ్నించింది.

‘‘బెయిల్‌ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం. అతడి బెయిల్‌ను రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు. కానీ, సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. దీనిపై విచారణ జరుపుతాం’’ అని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.

డీఎంకే నేత సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.  49 ఏండ్ల సెంథిల్‌ బాలాజీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011-2015లో రవాణా మంత్రిగా పనిచేసిన అతడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సెప్టెంబర్‌లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా కొద్ది గంటల్లోనే ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీంతో ఆయన మంత్రివర్గంలో సెంథిల్‌తో పాటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.