పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఉభయసభల్లో నిత్యం వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి చర్చలూ జరగకుండానే వాయిదాలు పడుతుండటంపై విపక్ష కూటమి ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్ ఘటన, అజ్మేర్ ఘటన, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి మాత్రం వీటిపై చర్చ ఇష్టంలేదని విమర్శిస్తున్నారు.
వీటితోపాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు రాజ్యాంగంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని, అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినా ఎప్పుడు చర్చ చేపడుతారనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదని జైరామ్ రమేష్ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ సమావేశం జరిగింది. మంగళవారం నుండి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లను స్పీకర్ కోరారు. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్ల కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యంగా లోక్సభలో సంభాల్ అంశం, బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన