ఐసీసీ అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు

ఐసీసీ అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులో ఆయన ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు ఆయనే. గతంలో ఆయన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే పని చేశారు. 
 
ఆయన నాలుగు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా కొనసాగారు. జై షా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఐసీసీ అధ్యక్షుడిగా నియామకమైన భారతీయుడు జై షా. ఇంతకు ముందు దివంగత జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, శశాంక్‌ మనోహర్‌, పారిశ్రామికవేత్త ఎన్‌ శ్రీనివాసన్‌ ఐసీసీ అధ్యక్షులుగా పని చేశారు. 
 
ప్రస్తుతం జై షా ముందు సవాళ్లు ఉన్నాయి. దాయాది దేశం పాక్‌ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ ట్రోఫీ కోసం జట్టును పాక్‌కు పంపేది లేదని భారత్‌ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐసీసీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తారు? హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆ దేశాన్ని ఒప్పిండం సవాల్‌గా మారనున్నది.
 
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా తనయుడు జై షా క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా తన కెరీర్‌ను 2009లో ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పని చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఏ) జాయింట్ సెక్రటరీ నియామకమయ్యారు. ఆ తర్వాత 2015లో బీసీసీఐ బోర్డ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ కమిటీ సభ్యుడిగా చేరారు.
 
2019 అక్టోబర్‌లో బీసీసీఐ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించారు. అతిపిన్న వయసులో బీసీసీఐ సెక్రెటరీ బాధ్యతలు తీసుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి పదవీకాలంలో సౌరవ్‌ గంగూలీతో పని చేశారు. ఆ తర్వాత రోజర్‌ బిన్నీతో కలిసి పని చేశారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా బిన్నీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2022లో ఐదేళ్లపాటు ఐపీఎల్ మీడియా హక్కులను రూ.48,390 కోట్లకు విక్రయించేలా జై షా కృషి చేశారు.
 
 ప్రతి మ్యాచ్‌ విలువ ఆధారంగా ఎన్‌ఎఫ్‌ఎల్‌ తర్వాత ఐపీఎల్‌ రెండో అత్యంత విలువైన క్రీడగా తీర్చిదిద్దారు. ఇక 2021లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ ఏడాది జనవరిలో మరోసారి ఆయనకే ఏసీసీ బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 2022లో ఐసీసీ ఫైనాన్స్ అండ్‌ కమర్షియల్ అఫైర్స్ సబ్-కమిటీకి చీఫ్‌గా నియామకమయ్యారు. కామన్వెల్త్ గేమ్స్ తదితర ఈవెంట్లలో క్రికెట్‌ని చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.