వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం
 
* ముగ్గురు గాంధీలు ఒకేసారి పార్లమెంట్​కు

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో తన ప్రత్యర్థులపై 4 లక్షల 4 వేల 619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎల్​డీఎఫ్​ అభ్యర్థి సత్యన్‌ రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్‌లో పోటీ చేశారు.

2019 జనవరి 23న ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ, అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటి సారి. తొలుత తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌కు పూర్తి ఇన్‌ఛార్జ్​గా బాధ్యతలు చేపట్టారు. 

రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిరంతరం ఉత్తర్​ప్రదేశ్​లో ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వయనాడ్‌ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంటులోకి అడుగు పెట్టనున్నారు. 

అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇదివరకు ఇందిరా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఒకేసారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యలు చట్టసభల్లో ఉంటారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యుడు. ఇప్పుడు ప్రియాంక గెలవడం వల్ల ఆ కుటుంబం నుంచి మూడో వ్యక్తిగా కానున్నారు.

2024 లోక్​సభ ఎన్నికల్లో వయనాడ్​, ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. వయనాడ్‌లో ఎన్నికల్లో సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడం వల్ల ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు. 

దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక రంగంలోకి దిగారు. రాహుల్​ గాంధీ మెజార్టీకన్నా ఎక్కువగా, 4.46 లక్షల ఓట్లతో గెలిచారు.
ఝార్ఖండ్‌ తొలి విడత ఎన్నికలతో పాటుగా నవంబర్ 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది.