జగన్ దోచుకున్న సొమ్ములను కక్కిస్తాం

జగన్ దోచుకున్న సొమ్ములను కక్కిస్తాం
గడిచిన ఐదేళ్లల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ హెచ్చరించారు. గడిచిన ఐదేళ్లల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ , నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ జగన్ పాలన అని ఆమె విమర్శించారు.
 
జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆమె ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారని ఆమె  మండిపడ్డారు. ప్రచారం పిచ్చి పీక్‌లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. భూమి హక్కు దారులను కూడా కాదని తన సొంత భూముల్లాగా పట్టాదారుపాస్ పుస్తకాలపై జగన్ తన ఫొటో వేయించుకున్నారని ఆమె మండిపడ్డారు. 
 
దేశం మొత్తం అమలవుతున్న కేంద్రం పథకానికి కూడా తన పేరు, స్టిక్కర్ మార్చుకున్నారని యామిని శర్మ విమర్శించారు. జగన్ అబద్దాలు తెలుసుకున్న కేంద్రం రూ. 4,000 కోట్లు  నిలిపేసిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు దోచేశారని ఆమె మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని ఆమె పేర్కొన్నారు. 
 
మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని ఆమె తెలిపారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4కోట్ల ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. ఇందులో మూడు కోట్ల మంది మహిళలను ఇంటి యజమానురాలుగా మోదీ మార్చారని చెబుతూ మహిళా సాధికారితను ఆచరించి చూపిన నేత మోదీ అని ఆమె ప్రశంసించారు. ఈ ఇళ్లల్లో 65 శాతం ఎస్సీ, ఎస్టీలకు 5శాతం వికలాంగులకు కేటాయించారని యామినీ శర్మ తెలిపారు.
‘‘కొండ ప్రాంతాల్లో కూడా 84లక్షల ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా వివిధ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లల్లో 5.36లక్షల కోట్లతో మరో మూడు లక్షల ఇళ్లు నిర్మించేంలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీలో పట్టణాల్లో 21.37లక్షల ఇళ్లను కేటాయించగా, గ్రామాల్లో 2.30లక్షల ఇళ్లను నిర్మాణం చేసింది. ఇందు కోసం రూ. 32వేల కోట్లు కేటాయించగా, పూర్తైన ఇళ్లకు రూ. 23వేల 800కోట్లు విడుదల కూడా చేసింది” అంటూ ఆమె వివరించారు. 

రూ.1.80లక్షలు ఒక్కో ఇంటికి కేంద్రం ఇవ్వడంతో పాటు, బ్యాంకులో రుణ సదుపాయం కూడా కల్పించిందని ఆమె చెప్పారు. అయితే, ప్రశ్నించిన వారిపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించిన జగన్ ఇప్పుడు మానవత్వ విలువలు అంటూ మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లల్లో ఇటువంటి మానవత్వం జగన్‌లో ఎందుకు లేకుండా పోయిందని ఆమె ప్రశ్నించారు.

కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల పుస్తెలు తెంపన వ్యక్తి జగన్ గంజాయి, మద్యం, డ్రగ్స్, చీప్ లిక్కర్, మహిళల మిస్సింగ్‌లో, శాంతిభధ్రతల క్షీణించడంలో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలిపారని ఆమె ధ్వజమెత్తారు. మరో రెండు నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేయాలనే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆమె చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ చేతకాని విధానాలతో దుర్వినియోగం చేశారని ఆమె ధ్వజమెత్తారు.

‘‘ఏపీ అభివృద్దిలో కేంద్రం చాలా సహకారం అందిస్తుంది. ఇవన్నీ చూసి జగన్ తట్టుకోలేక.. డైవర్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టే.. వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోచుకున్న నాయకులు  పచ్చి బూతులు మాట్లాడారు. మహిళలపై అన్యాయంగా పోస్టులు పెట్టి, నోరు పారేసుకున్న వారు నేడు అనుభవించాల్సిందే” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దయ, జాలి, కరుణ ఏమాత్రం చూపని జగన్, వైసీపీ నేతలు చట్టం ముందు దోషులుగా నిలబపడి తీరుతారని బిజెపి నేత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందని చెబుతూ అమరావతి రాజధానికి కూడా కేంద్రం నిధులు విడుదల చేసిందని ఆమె గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వచ్చే ఐదేళల్లో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు చూసి అందరూ ఆశ్చర్యపోతారని యామినీ శర్మ భరోసా వ్యక్తం చేశారు.