
మహాయుతి కూటమి పక్షాన ఇటీవల ప్రచారం చేసిన యూపీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ హిందువులను ఉద్దేశించి ‘కటేంగోతో బటేంగే’(ఐక్యత లేకపోతే విభజిస్తారు) అని వ్యాఖ్యానించారు. యోగి చేసిన వ్యాఖ్యలను కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బహిరంగంగానే తప్పుబట్టారు.
యోగి వ్యాఖ్యలను ఖండించారు. మతతత్వ భావనతోనే యోగి ఇలా వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడణవీస్ మాట్లాడుతూ ఆయనలో(అజిత్) హిందూ వ్యతిరేక భావజాలం ఉందని, అందుకే యోగి వ్యాఖ్యలపై అలా వ్యాఖ్యానించారని చెప్పారు. అంతేకాదు, ప్రజల మనసులు అర్ధం చేసుకునేందుకు అజిత్కు కొంత సమయం పడుతుందన్నారు.
‘‘యోగి నినాదంలో తప్పేముంది? ఈ దేశ చరిత్రనే ఆయన చెప్పుకొచ్చారు’’ అని యోగిని ఫడణవీస్ సమర్థించారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలని యోగి పిలుపునివ్వడంలో తప్పులేదని స్పష్టం చేశారు. ‘‘అజిత్.. సుదీర్ఘకాలం పాటు హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి ప్రయాణించారు. ఆయనలోనూ హిందూ వ్యతిరేక భావజాలం ఉంది. తమకు తాము లౌకిక వాదులమని చెప్పుకొనే వారిలో నిజమైన లౌకిక వాదం లేదు. హిందూత్వను వ్యతిరేకించే వారితో అజిత్ దశాబ్దాల పాటు కలిసి ఉన్నారు’’ అని ఫడణవీస్ వ్యాఖ్యానించారు.
‘‘ఇలాంటి ప్రజల సెంటిమెంట్లను అర్ధం చేసుకోలేరు. వారి ప్రకటనలను కూడా అర్ధం చేసుకోలేరు. ఇంకేదో చెపాలనుకుంటారు’’ అని అన్నారు. యోగి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్న ఆయన ఆ నినాదం భారత దేశ చరిత్రను చాటి చెబుతుందని తెలిపారు.
‘‘యోగి నినాదంలో ఎలాంటి తప్పూ లేదు. మన చరిత్రను చూడండి. ఎప్పుడెప్పుడు విడిపోయామో అప్పుడప్పుడు బానిసలుగా మారాం. ఎప్పుడైతే ఈ దేశం కులాలు, రాష్ట్రాలు, మతాలు, సంఘాలుగా విడిపోయిందో అప్పుడప్పుడల్లా మనం బానిసలమైపోయాం. దేశం, ప్రజలు కూడా విడిపోయారు. అందుకే మనం(హిందువులు) ఐక్యంగా ఉండాలి. ఇదీ మన చరిత్ర. చిత్రం ఏంటంటే.. విభజన వద్దని చెప్పేవారే.. యోగి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఇదే నాకు అర్ధం కావడం లేదు’’ అని ఫడణవీస్ వివరించారు.
మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి మెజారిటీ దక్కించుకున్నా ముఖ్యమంత్రి పీఠంపై ఏర్పడిన వివాదంతో ఈ కూటమి విచ్ఛిన్నమైంది. అయితే, అప్పట్లో ఎన్సీపీ నేతగా ఉన్న శరద్ పవార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని తాజాగా ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు.
‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ సమయంలో ఎన్సీపీ నుంచి ఇద్దరు నాయకులు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించగారు. ఈ ఆఫర్ చూసి నేను ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరూ శరద్ పవార్ పంపించిన వారేనని తెలిసింది.
దీంతో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులపై వారితో చర్చించాం. ఎన్నికలు ముగిసిన తర్వాత శరద్ పవార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తొలుత రాష్ట్రపతి పాలనకు వెళ్లాలని భావించారు. తర్వాత శరద్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుతున్నట్టు చెప్పి తర్వాత తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భావించారని ఆయన తెలిపారు.
అంతేకాదు, వాస్తవానికి రాష్ట్రపతి పాలన కోసం “ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని’ పేర్కొంటూ ఎన్సీపీ సిద్ధం చేసిన లేఖ మా దగ్గరే సిద్ధమైంది. తర్వాత శరద్ పవార్ అనుమతి తీసుకుని గవర్నర్కు పంపించాం. ఉద్ధవ్ మాతో అంటీ ముట్టనట్టు ఉండేసరికి పవార్తో చేతులు కలపాలని నిర్ణయించాం’’ అని ఫడణవీస్ వివరించారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం