`ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్’ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ

`ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్’ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ

* అభినందించిన ప్రధాని మోదీ

బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ‘ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్‌’ని విజయవంతంగా పూర్తి చేశారు. ‘ఐరన్‌మ్యాన్ 70.3 ఛాలెంజ్‌’లో మూడు విభిన్న రకాల ఛాలెంజ్‌లు ఉంటాయి. కఠినమైన ఈ సవాలును ఆదివారంలో గోవాలో ఆయన పూర్తి చేశారు.  1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల రన్నింగ్‌‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఛాలెంజ్‌లో మొత్తం కలిపి 113 కిలోమీటర్ల (70.3 మైళ్లు) దూరం వరకు ప్రయాణించారు. దీంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన మొట్టమొదటి పార్లమెంటేరియన్‌గా ఈ 33 ఏళ్ల ఈ యువ ఎంపీ నిలిచారు.  ఈ సవాలును స్వీకరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ ఉద్యమమే ప్రేరణ అని ఎంపీ తెలిపారు. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి గత నాలుగు నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు ఎంపీ సూర్య తెలిపారు.

గొప్ప ఆశయాలను సాధించాలనుకుంటున్న యువ దేశంగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.  ‘‘భారత్ మరింత ఆరోగ్యవంతమైన దేశంగా మారాలి. ఫిట్‌గా మారడానికి చేసే ప్రయత్నం మరింత క్రమశిక్షణతో పాటు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇది మీరు మీరు ఏ పని చేసినా మీ విజయావకాశాలను మెరుగుపరుస్తుంది’’ అని ఎక్స్‌లో ఆయన రాసుకొచ్చారు.

‘‘కఠినమైన ఈ ఛాలెంజ్‌లో పూర్తి చేసిన వ్యక్తిగా ఫిట్‌నెస్ లక్ష్యాలు మీ సరిహద్దులను పెంచుతాయని, మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా నిలుపుతుందని నేను యువకులకు చెప్పాలనుకుంటున్నాను’’ అని ఆయన తెలిపారు.ఈ విజయాన్ని వారి అకుంఠిత దీక్షను, విజయాలను గుర్తిస్తూ భారతీయ క్రీడాకారులకు అంకితం చేస్తున్నట్లు తేజస్వి సూర్య ప్రకటించారు.

‘ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్’ను పూర్తి చేసిన ఎంపీని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. ‘‘ప్రశంసదగిన ఫీట్ సాధించారు!. ఫిట్‌నెస్‌కు సంబంధించిన కార్యకలాపాల విషయంలో మీరు స్వీకరించిన ఛాలెంజ్ చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను’’ అని చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

కాగా ఎంపీ తేజస్వి సూర్య రిలే టీమ్‌లో భాగంగా ఐరన్‌మ్యాన్ 70.3 ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం నిర్వహించే ఈ ప్రీమియర్ ఈవెంట్‌లో 50కి పైగా దేశాల అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన రేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన 120 మంది పాల్గొన్నారు. పాల్గొన్న అథ్లెట్లలో మహిళళు 12-15 శాతం మంది ఉన్నారు. ఈ సంవత్సరం పాల్గొనేవారిలో 60 శాతానికి పైగా తొలిసారి పాల్గొన్నవారే కావడం విశేషం.