`డబల్ ఇంజిన్ సర్కార్’తో అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ఏపీ

`డబల్ ఇంజిన్ సర్కార్’తో అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ఏపీ
అమరావతికి రైల్వే కనెక్టివిటీ కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ `డబల్ ఇంజిన్ సర్కార్’ కారణంగా అభివృద్ధిలో ఏపీ పరుగులు తీస్తున్నదని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ డి పురందేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ బిజెపి కార్యాలయంలో జరిగిన సంబరాలలో ఆమె పాల్గొన్నారు. 
 
రూ 2,245 కోట్ల వ్యయంతో అమరావతికి రైల్వే అనుసంధానం కలిగిస్తూ ఎర్రుపాలెం నుండి నంబూరు వరకు 57 కిమీ మేరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించడం పట్ల ఆమె అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహద పడుతుందని చెబుతూ ఏపీ ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన అంశమని ఆమె చెప్పారు. పర్యావరణ మార్పు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటవీ సంపదకు హాని కలగకుండా అంటే 25 లక్షల చెట్లు నాటాలని నిర్ణయించడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు. ఈ సందర్బంగా కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రజల తరపున ఆమె ధన్యవాదములు తెలిపారు.

అమరావతినే రాజధాని అని మొదటి నుంచీ బీజేపీ చెబుతోందని, కేంద్రం కూడా అమరావతి రాజధాని అని మొదటి నుండి ప్రతిపాదిస్తూనే వస్తోందని పురందేశ్వరి ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైల్ లైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని ఆమె కొనియాడారు.

వికసిత్ భారత్ 2047 సాధించాలనేది బీజేపీ లక్ష్యమని చెబుతూ ఈ లక్ష్య సాధనలో  వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా చాల ముఖ్యమైన అంశమని పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహ భాగం కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని అశ్వినీ వైష్ణవ్‌ తెలపడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

‘అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నాం” అని చెప్పారు. ఈ రైలుమార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటి వస్తుందని పేర్కొన్నారు.