విజయమ్మ, షర్మిలపై ఆస్తుల వివాదంలో జగన్ కేసు!

విజయమ్మ, షర్మిలపై ఆస్తుల వివాదంలో జగన్ కేసు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎపిసిసి అధ్యక్ష పదవి స్వీకరించినప్పటి నుండి వారి  కుటుంభంలో రాజకీయ విబేధాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఆస్తుల విషయంలో నెలకొన్న విబేధాలు సహితం ట్రిబ్యునల్ ముందుకు వచ్చాయి. అన్న, చెల్లెలు మధ్య ఆస్తుల వివాదంపై రాజీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.

ఎన్నికల సమయంలో ఆస్తి పంపకాలపై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  తాజాగా ఓ కంపెనీ షేర్ల విషయంలో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఏకంగా సోదరుడు వైఎస్ జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో పిటిషన్ వేశారు.  తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలకు కేటాయించిన షేర్లను వెనుకకు తీసుకుంటున్నట్లు పేర్కొంటూ  జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిలు పిటిషన్ దాఖలు చేశారు.

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టిలో జాబితా చేయబడిన ఈ కేసు కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేయబడింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశామని తెలిపారు. అయిత వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని, ఇది ప్రస్తుత వివాదానికి దారి తీసిందని పిటిషన్ లో ప్రస్తావించారు. తన సోదరి వైఎస్ షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామని జగన్ తన పిటిషన్ లో వివరించారు.

అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని పేర్కొంటూ తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్, భారతి అభ్యర్థించారు. పిటిషన్ ను స్వీకరించిన  ఎన్‌సీఎల్‌టీ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8, 2024కి షెడ్యూల్ చేసింది.