ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ దారుణ హత్య

ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ దారుణ హత్య
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ- అజిత్​ పవార్​ వర్గం) నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. హిందీ చిత్ర పరిశ్రమలో సంబంధాలున్న హై-ప్రొఫైల్ పొలిటీషియన్ సిద్ధిఖీని విజయ దశమి రోజున గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దుండగులను అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే తెలిపారు.

“ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ నాకు చెప్పారు. ఒకరు యూపీకి చెందినవారు కాగా, మరొకరు హరియాణాకు చెందినవారు. మూడో దుండగుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పారు,” అని ఏక్​నాథ్​ షిండే తెలిపారు.  ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఆసుపత్రికి వెళ్లి బాబా సిద్దిఖీ కుటుంబాన్ని పరామర్శించారు. తన సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై మరో ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విజయ దశమి రోజున తన కుమారుడు జీషాన్ కార్యాలయం దగ్గర బాణాసంచా పేల్చుతుండగా బాబా సిద్ధిఖీపై దాడి జరిగింది. మీడియా కథనాల ప్రకారం రాత్రి 9.15 నుంచి 9.20 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్యెల్యే అయ కుమారుడు జీషాన్ సిద్దిఖీ కార్యాలయం ముందు టపాసులు పేల్చుతుండగా ముగ్గురు దుండగులు ముఖానికి కండువా కప్పుకుని వాహనం నుంచి బయటకు వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు.

ఎన్​సీపీ నేత కడుపు, ఛాతీలోకి ఆరు బుల్లెట్​లు దూసుకెళ్లాయి. ఇది గమనించిన వారు సిద్ధిఖీని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బాబా సిద్దిఖీని దుండగులు ఎందుకు చంపారు? ఎవరైనా ఆయన్ని చంపించారా? దీని వెనుక ఎవరున్నారు? వంటి ఎన్నో ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ వీటిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

ఈ ఘటనలో బాబా సిద్దిఖీ సహచరుడికి కూడా గాయాలయ్యాయని సమాచారం. బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిఖీ ఈ ఏడాది మార్చ్​లో కాంగ్రెస్​ని వీడి ఎన్​సీపీలో చేరారు. సిద్ధిఖీ 2000 ప్రారంభంలో కాంగ్రెస్- అవిభాజ్య ఎన్​సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఈ దాడి అత్యంత దురదృష్టకరమని, ఖండించదగినదని ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అభివర్ణించారు. మైనార్టీలు, లౌకికవాదం కోసం పోరాడిన నాయకుడిని కోల్పోయామని ఎన్​సీపీ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. విలాసవంతమైన పార్టీలు ఏర్పాటు చేయడంలో ప్రసిద్ధి చెందిన అయన 2013లో ఓ భారీ పార్టీ ఏర్పాటు చేసి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల మధ్య రాజీ కుదిర్చి, వారి మధ్య ప్రచ్ఛన్న పోరుకు ముగింపు పలికారు.