యూఏఈనుండి 148 మందితో భారత్ కు తొలి విమానం

యూఏఈనుండి 148 మందితో భారత్ కు తొలి విమానం

* భారత్ లో 25 రోజుల చమురు నిల్వలు 

ఎట్టకేలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గగనతలం పాక్షికంగా తెరుచుకుంది. దీంతో అక్కడి నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం దుబాయ్‌ నుంచి న్యూడిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ గత 24 గంటల్లో భారత్‌లోకి ప్రవేశించిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ఇదే. ఇక యూఏఈలో ఇరుక్కుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఫుజైరా నుంచి ఢిల్లీ, ముంబయి, కొచ్చిలకు నాలుగు ప్రత్యేక విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ ప్రకటించింది.   యూఏఈ నుంచి భారత్‌కు పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభమైన విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ శాఖకు చెందిన ప్రవాస భారతీయుల తరలింపు విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 2వ తేదీ సాయంత్రం నుంచి యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని వెల్లడించింది.  యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయని తెలిపింది. దుబాయ్‌లోని ఈ రెండు ఎయిర్‌పోర్టులను పూర్తిగా మూసివేయలేదని, కానీ వాటిలోకి ప్రవేశించే ప్రయాణికులను కఠినంగా స్క్రీనింగ్ చేస్తున్నారని విదేశాంగ శాఖ చెప్పింది. 

స్పైస్ జెట్ కూడా యూఏఈకి విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మార్చి 4 నుంచి కొన్నిరోజుల పాటు యూఏఈలోని ఫుజైరా నుంచి భారత్‌కు నాలుగు ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతామని వెల్లడించింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా సుమారు 250కి పైగా విమానాలు రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో సుమారు 250కి పైగా విమానాలు రద్దయ్యాయని అధికారులు మంగళవారం తెలిపారు.  వరుసగా నాలుగవ రోజు కూడా విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 
 
ఢిల్లీ విమానాశ్రయంలో 80 విమానాలు రద్దు చేయగా, ముంబయి విమానాశ్రయంలో 107 సర్వీసులు రద్దైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా బెంగళూరు విమానాశ్రయంలో సుమారు 42 సర్వీసులు, చెన్నై నుండి 30 విమానాలు రద్దయ్యాయి. ఫిబ్రవరి 28 పశ్చిమాసియాలో సంక్షోభం తలెత్తినప్పటి నుండి, భారతవిమానయాన సంస్థలు గత మూడు రోజుల్లో 1,117 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశాయి.

ఇలాఉండగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారతదేశంలో 25 రోజుల ముడి చమురు, శుద్ధి చేసిన చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు ధరలు తీవ్రంగా పెరిగినప్పటికీ పెట్రోల్,  డీజిల్ ధరలను పెంచే తక్షణ ప్రణాళికలు లేవని కూడా వర్గాలు తెలిపాయి.