17న హ‌ర్యానాలో కొత్త ప్రభుత్వం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం

17న హ‌ర్యానాలో కొత్త ప్రభుత్వం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం
* 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 17వ తేదీన పంచకుల లో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని పంచకుల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యష్ గార్గ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు గవర్నర్ బండారు దత్తాత్రేయ నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. 
 
ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి యష్ గార్గ్ నేతృత్వం వహిస్తున్నారు.   హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 
 
గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఆయన సారథ్యంలోనే బీజేపీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. పార్టీ గెలిస్తే సైనీనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ సైతం సంకేతాలిచ్చింది.
 
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మొత్తం 90 సీట్లలో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ప్రకటించారు.
కాగా, జమ్మూకశ్మీర్​లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్​ (ఎన్​సీ), కాంగ్రెస్ కూటమి కూటమి సిద్ధమైంది. ఎన్​సీ అధినేత ఒమర్ అబ్దుల్లా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్​ మనోజ్ సెన్హాను కలిశారు. తమ కూటమికి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు గురించి తెలుపుతూ ఎల్​జీకి ఓ లేఖ సమర్పించారు. ఈ నెల 16న అంటే బుధవారం రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్​కు తెలియజేసినట్లు ఒమర్ అబ్దుల్లా మీడియాకు తెలిపారు.