
మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమకు ఎదురైన వేధింపుల ఘటనలపై నటీమణులు ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో సినీయర్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. హేమా కమిటీ రిపోర్టును ఎందుకు జాప్యం చేశారని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
కేవలం మలయాళం చిత్ర పరిశ్రమలోనే కాకుండా, మహిళలను వేధించడం అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నట్లు ఆమె ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాలను రాధిక ఓ ఛానల్కు తెలిపింది. కారవాన్లలో రహస్య కెమెరాల ద్వారా హీరోయిన్ల వీడియోలను తీసి, వాటిని చూసే నటులను తాను గమనించినట్లు రాధిక వెల్లడించారు.
కారవాన్లలో మహిళలు దుస్తులు మార్చుకునే వీడియోలను తాను చూసినట్లు చెప్పారు. అయితే ఏ చిత్రం షూటింగ్ సమయంలో ఆ ఘటన జరిగిందో, ఏ నటులు ఆ వీడియోలు చూశారన్న అంశాన్ని మాత్రం రాధిక వెల్లడించలేదు. సీక్రెట్ కెమెరాల విషయంలో కారవాన్ల ఇంచార్జీలకు గతంలో వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. ఒక మళయాళ సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోనని ఆమె పేర్కొన్నారు.
‘షాట్ ముగించుకుని తాను వెళ్తుండగా సెట్లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్లో వీడియోలు చూస్తూ నవ్వుకుంటున్నారు. వెంటనే చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారో తెలుసుకోమని చెప్పాను. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని ఆయన నాకు చెప్పారు. వెంటనే ఈ విషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెబుతానని ఆ టీమ్ను హెచ్చరించా’ అని రాధిక తెలిపారు.
ఆ సంఘటన తర్వాత కారవాన్ను ఉపయోగించాలంటే తనకు భయం పట్టుకుందని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఇలా పలు పనులకు సెట్లో అదే తమకు వ్యక్తిగత ప్రాంతమని చెప్పారు. అంతేకాదు, చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం దురదృష్టకరమని తెలిపారు.
అన్నిచోట్లా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారుని ఆమె స్పష్టం చేశారు. అలాగే హేమ కమీటి రిపోర్టుపై తోటి పురుష నటులు మౌనంగా ఉండడంపై రాధిక మండిపడ్డారు. ఇప్పుడు తమను తాము రక్షించుకునే బాధ్యత నటీమణులపై ఉందని ఆమె చెప్పారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే