సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం

సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం
దేశంలో సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీమీటర్లలో 109 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర పేర్కొన్నారు. వాయువ భారత్‌, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో సహా వాయువ్య ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందదని తెలిపారు.  భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, వాయువ్య భారతంలోని కొన్ని, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర బీహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్, అలాగే ఈశాన్య భారతదేశంలో చాలా వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఐఎండీ చీఫ్‌ వెల్లడించారు. 
 
రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలోనే ఉంటుందని, బంగాళాఖాతంలో పలు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమ-వాయువ్య దిశగా రాజస్థాన్‌ వరకు.. ద్రోణి హిమాలయాల వైపు సైతం వెళ్లవచ్చని తెలిపారు. సెప్టెంబరులో ఈ ప్రాంతాన్ని వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు.దేశంలో ఆగస్టులో సాధారణం కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతదేశంలో 253.9 మిమీ వర్షపాతం నమోదైందని.. 2001 నుంచి ఆగస్టు ఇది రెండో అత్యధిక వర్షాపాతమని ఐఎండీ తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ మోహపాత్ర మాట్లాడుతూ ఆగస్టులో దేశంలో 287.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. 

జూన్ ఒకటిన రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌లో 749 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. హిమాలయాల దిగువన, ఈశాన్య ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాపాతం రికార్డయ్యింది. అల్పపీడనాలు చాలా వరకు సాధారణ స్థితికి దక్షిణంగా ఏర్పడ్డాయి. రుతుపవన ద్రోణి సాధారణ స్థితికి దక్షిణంగానే ఉందని ఐఎండీ చీఫ్‌ తెలిపారు. 

కేరళ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు లోటు వర్షాపాతం నమోదైందని పేర్కొన్నారు. ఆగస్టులో ఆరు అల్పపీడ ద్రోణులు ఏర్పడ్డాయని.. వాటిలో రెండు రుతుపవనాల అల్పపీడనాలుగా మారాయాని మృత్యుంజయ్‌ మోహపాత్ర వివరించారు.