కాళేశ్వరం డిజైన్ల విషయంలో కేసీఆర్, హరీష్ ఒత్తిడి

కాళేశ్వరం డిజైన్ల విషయంలో కేసీఆర్, హరీష్  ఒత్తిడి
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు ఒత్తిడి తెచ్చారని సీడీవో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు ఉన్నతాధికారులు డిజైన్లు త్వరగా ఆమోదించాలని తమను ఒత్తిడికి గురిచేశారని వెల్లడించారు. 
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలో భాగంగా గురువారం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్‌తోపాటు సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరై  బ్యారేజీలు నిర్మించాల్సిన ప్రాంతాలకు అనుగుణంగానే డిజైన్లు రూపొందించామని  వివరించారు.

సీడబ్ల్యూసీకి పంపిన తర్వాత కూడా డిజైన్లలో కొన్ని మార్పులు జరిగాయని వెల్లడించారు. బ్యారేజీల నిర్వహణ సరిగా లేదని, మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉన్నా తగిన రీతిలో వారు స్పందించలేదని తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్‌లకు ఫైనల్ అప్రూవల్‌కు మొదటగా సిడివో స్థాయిలో తాను సంతకం చేయలేదని నరేందర్‌రెడ్డి జస్టిస్ పి.సి.ఘోస్ కమిటీ ముందు వెల్లడించారు. 

మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల సంతకాలు చేశానని తెలిపారు. త్వరగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావుడిగా అన్ని అప్రూవల్ చేశామని స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రతి డిజైన్‌లో సీడీవోతో పాటు ఎల్‌అండ్‌టీ సంస్థ పాల్గొందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ సంబంధిత చర్చల్లో తాను పాల్గొనలేదని, తనను ఎవరూ పిలవలేదని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్‌కు, క్షేత్ర స్థాయిలో జరిగిన నిర్మాణాలకు తేడాలు ఎందుకు ఉన్నాయని కమీషన్ ప్రశ్నించగా, ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయని వివరించారు. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా చేయలేదని, బ్యారేజీల నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సైతం కాంట్రాక్టు సంస్థతోపాటు అధికారులు కూడా సరిగా చేయలేదని వెల్లడించారు. 

వర్షాకాలాలని ముందు పాటించాల్సిన నిబంధనలలను కూగా గ్రౌండ్ లెవెల్‌లో అధికారులు కాంట్రాక్టు సంస్థలు సరైన రీతిలో పాటించలేదని తెలిపారు. కాగా, నరేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెకటు సంబంధించి జస్టిస్ పి.సి.ఘోస్ కమిటీ ముందు కొన్ని అంశాల్లో దాట వేత ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.