ఈడీ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్

ఈడీ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫుల్‌టైమ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌ నియామకమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ బుధవారం ఆయనను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు చెందిన 1993వ బ్యాచ్ అధికారి. ఈడీ డైరెక్టర్‌గా పని చేసిన సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం గతేడాది సెప్టెంబర్‌ 23తో పదవీకాలం ముగిసింది. 
 
ఆయన స్థానంలో యాక్టింగ్‌ డైరెక్టర్‌గా నవీన్‌ బాధ్యతలు చేపట్టారు. గతంలో సంజయ్‌ మిశ్రా ఆధ్వర్యంలో రాహుల్‌ నవీన్‌ సైతం సేవలందించారు. ఇక రాహుల్‌ నవీన్‌ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతున్నారు. లేదంటే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబర్‌లో ఈడీలో స్పెషల్‌ డైరెక్టర్‌గా చేరారు.
 
ప్రస్తుతం దేశంలోని వందకుపైగా రాజకీయ నేతల కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తున్నది. ఇక ఐఆర్‌ఎస్‌ అధికారి విషయానికి వస్తే ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేశారు. మెల్‌బోర్న్‌లోని స్విన్బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలీజ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆయనకు అంతర్జాతీయ పన్నుల విషయాల్లో మంచి అనుభవం ఉన్నది. దాదాపు 30 సంవత్సరాలుగా ఐటీ విభాగంలో సేవలందిస్తూ వస్తున్నారు. 
 
అంతర్జాతీయ పన్నుల విభాగంలో ఆయన పనిచేసిన కాలంలో వోడాఫోన్ కేసుతో సహా అనేక ఆఫ్‌షోర్ లావాదేవీలపై సందేహాలు లేవనెత్తింది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాళీ ఘటనలో ఆయన ఆధ్వర్యంలో అధికారుల బృందం భయపడకుండా పని చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని పౌర నిబంధనలతో పాటు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం (ఎఫ్ఈఓఏ) అనే రెండు క్రిమినల్ చట్టాల కింద ఈడీ ఆర్థిక నేరాలపై పరిశోధిస్తున్నది.