విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డి పెట్టుబడులు సాధించారా!

విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డి పెట్టుబడులు సాధించారా!
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంతిర్ హోదాలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లి బుధవారం తిరిగి వచ్చారు.  ఈ పర్యటనలో రూ. 31,500 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 
 
19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నట్టు వివరించింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు లభించనున్నట్టు తెలిపింది. అయి తే, రేవంత్‌ అమెరికా పర్యటనలో భాగంగా ఎంవోయూ చేసుకొన్న కంపెనీల్లో కొన్ని బోగస్‌ కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు రావడం గమనార్హం.
 
అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేయడంతో పాటు తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చిందని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. 
 
యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు నిర్వహిస్తున్నారు. అమెజాన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియ‌న్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.

కాగా, అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్‌ బృందం ఒప్పందాలు చేసుకొన్న కొన్ని కంపెనీలు నెలల ముందే ప్రారంభమవ్వడం, వాటికి సరైన కార్యాలయాలు, సిబ్బంది కూడా లేకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. ఉదాహరణకు బయోఫ్యూయల్స్‌ తయారీ సంస్థ స్వచ్ఛ్‌బయోతో రాష్ట్ర ప్రభు త్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. రూ. వెయ్యి కోట్లను ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్టు రేవంత్‌ ప్రభుత్వం ప్రకటించింది.

కిందటినెలలోనే ఏర్పాటై, ఇద్దరు ఉద్యోగు లు కూడా లేని ఈ సంస్థ రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది.  పైగా ఈ కంపెనీ సీఎం రేవంత్‌ సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందినది కావడం, ఆ విషయాన్ని ప్రభుత్వవర్గాలు దాచడం వివాదాన్ని రేపింది. ఇక, తెలంగాణలోని వీ-హబ్‌లో రూ.42 కోట్లు, వీ-హబ్‌లోని స్టార్టప్‌ కంపెనీల్లో మరో రూ.839 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి వాల్ష్‌ కార్రా హోల్డింగ్స్‌ అనే సంస్థ ముందుకొచ్చినట్టు రేవంత్‌ ప్రభుత్వం ప్రకటించింది.

నాలుగు నెలల కిందట ఏర్పడి, ఇప్పటివరకు ఎలాంటి వార్షిక నివేదికలను విడుదల చేయని సదరు కంపెనీ అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎలా పెడుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న మరో రెండు కంపెనీల చరిత్ర కూడా సరిగ్గాలేదని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.