హసీనా ప్రధాని పదవికి ముప్పు కలిగించిన ద్వీపం

హసీనా ప్రధాని పదవికి ముప్పు కలిగించిన ద్వీపం
ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడ కుతంత్రం జరిగిన దాని వెనుక అమెరికా ఉంటుందనే ఆరోపణలు తలెత్తుతుంటాయి. తాజాగా బంగ్లాదేశ్ విషయంలోనూ ఇదే జరిగిందని సాక్షాత్తూ ఆ దేశ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనానే ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని హసీనా చెప్తున్నారు. 
 
ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని వదులుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటుని ఆమె పేర్కొన్నారు. సెయింట్ మార్టిన్ ద్వీపం మీద బంగ్లాదేశ్ సార్వభౌమత్యం వదులుకుని ఉంటే ప్రధాని పదవిలో కొనసాగేదాన్నంటూ హసీనా చెప్తున్నారు.  దీంతో బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోవడానికి, ఆమె ప్రధాని పదవి కోల్పోవడానికి కారణమైన ఆ సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 
 
దానితో సెయింట్ మార్టిన్ ద్వీపం మీద అమెరికా ఎందుకంత ఆసక్తి చూపిస్తోందనేదీ చర్చ నడుస్తోంది. మయన్మార్‌కు సమీపంలో ఉండే బంగ్లాదేశ్ ద్వీపకల్పం కాక్స్ బజార్ టెక్నాఫ్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ సెయింట్ మార్టిన్ ద్వీపం. బంగ్లాదేశ్‌కు ఉన్న ఏకైక పగడపు ద్వీపం ఇదే.  సెయింట్ మార్టిన్ ద్వీపం కేవలం మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్క డ 3,700 మంది నివసిస్తున్నారు. వీరు ప్రధానంగా చేపలు పట్టడం, వరి, కొబ్బరిసాగు, సముద్రపు పాచిని ఎండబెట్టి మయన్మార్‌కు ఎగుమతి చేస్తూ జీవనం సాగిస్తుంటారు. 
 
అయితే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియా ప్రయత్నించినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని ఖలీదా జియా ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. 
 
అలాగే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. సెయింట్ మార్టిన్ ద్వీపంలో కొబ్బరి చెట్లు అధికంగా ఉండటం వలన దీనిని కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్తారు. 
 
అలాగే ‘దారుచిని ద్వీప్’ , సిన్నమోన్ ఐలాండ్ అని కూడా అంటారు. అయితే సెయింట్ మార్టిన్ ద్వీపం ఒకప్పుడు టెక్నాఫ్ ద్వీపకల్పంలో కలిసి ఉండేది. అయితే కొంత భాగం మునిగిపోవడంలో వేరైంది. ఈ ద్వీపానికి గొప్ప చరిత్ర ఉంది, 18వ శతాబ్దంలో ఈ ద్వీపంలోకి అడుగుపెట్టిన అరేబియా వ్యాపారులు దీనికి జజీరా అని పేరు పెట్టారు. 
 
ఆ తర్వాత 1900ల్లో బ్రిటిష్ ల్యాండ్ సర్వే బృందం దీనిని బ్రిటీష్ ఇండియాలో భాగం చేసి క్రైస్తవ మతగురువు అయిన సెయింట్ మార్టిన్ పేరును పెట్టింది.
ఇక 1937లో మయన్మార్ విడిపోయిన తర్వాత కూడా సెయింట్ మార్టిన్ ద్వీపం బ్రిటీష్ ఇండియాలో భాగంగానే ఉండేది. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత ఈ దీవి పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లింది.
 
ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ సొంతమైంది. 1974లో ఈ ద్వీపం బంగ్లాదేశ్‌కు చెందుతుందనేలా మయన్మార్, బంగ్లాదేశ్ ఒప్పందం కూడా చేసుకున్నాయి. అయితే సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి బంగ్లాదేశ్- మయన్మార్ మధ్య ఒప్పందం జరిగినప్పటికీ.. సముద్ర సరిహద్దు మీద వివాదం నడుస్తూనే ఉంది.