* ప్రధాని మోదీ సంతాపం
వామపక్షాలతో సంస్కరణవాదిగా పేరొంది, పశ్చిమ బెంగాల్ ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని విఫలయత్నం చేసిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు. ఆయన 2000 నుంచి 2011 వరకు 11 ఏళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశారు. తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమార్తె సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు.
బెంగాల్కు ఆరవ ముఖ్యమంత్రిగా చేశారాయన. బెంగాల్లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏలాయి. ప్రపంచంలోని అతి చౌకైన కారు ఉత్పత్తిని తమ రాష్ట్రంలో చేపట్టేందుకు శ్రమించి, చివరకు తన సొంతపార్టీని కూడా తన విధానాలవైపు తీసుకు వెళ్లలేక ఆ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం పతనానికి నేతృత్వం వహించారు. ఆయన ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు.
రాష్త్ర హోమ్ మంత్రి, ముఖ్యమంత్రి వంటి కీలక పదవులు చేపట్టినా చివరి వరకు భార్య మీరు, కుమార్తె సుచేతనాలతో కలిసి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఒక చిన్న రెండు గదుల ప్రభుత్వ అపార్ట్మెంట్లో సాధారణ జీవనాన్ని గడిపారు. 2000 సంవత్సరంలో పార్టీ సీనియర్ నేత జ్యోతిబసు నుంచి బద్ధదేవ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందిగ్రామ్, సింగూరు కాల్పులు జరిగాయి.
రచయితగా, అధ్యాపకునిగా పేరొందిన ఆయన 1966లో సిపిఎం ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ యువజన విభాగంలో క్రియాశీలకంగా పనిచేశారు. కాస్సిపోర్-బెల్గాచియా స్థానం నుండి తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, భట్టాచార్జీ 1977 నుండి 1982 వరకు సమాచార, పౌర సంబంధాల మంత్రిగా పనిచేశారు.
1982లో కాసిపోర్ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత, భట్టార్చార్జీ జాదవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి 1987 నుండి 2011 వరకు గెలిచారు. 1987లో జ్యోతిబసు క్యాబినెట్లో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా చేరారు. అతను బసుతో విభేదాల కారణంగా 1993లో రాజీనామా చేశారు. అయితే కొన్ని నెలల తర్వాత తిరిగి చేరారు.
1996లో హోంమంత్రి, 1999లో బసు అనారోగ్యంతో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బసు తప్పుకున్న తర్వాత 2000 నవంబర్ 2న తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2002లో పార్టీ పొలిట్బ్యూరోకు ఎన్నికయ్యారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలోకి తీసుకొని, “పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేవ్ భట్టాచార్జీ మరణించినందుకు విచారంగా ఉంది. రాష్ట్రానికి నిబద్ధతతో సేవ చేసిన రాజకీయ ప్రముఖుడు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని తెలిపారు.
బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్బ్రాంతి, తీవ్ర సంతాపం తెలిపారు. బుద్ధదేవ్ భట్టాచార్య మరణంతో రాష్ట్ర కమ్యూనిస్ట్, వామపక్ష ఉద్యమంలో ఓ అధ్యాయం ముగిసిందని పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది. బుద్దదేవ్ భట్టాచార్య మృతి పట్ల.. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర మనస్తాపాన్ని కలిగించినట్లు చెప్పారు.

More Stories
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!