
* కేరళ విషాదం వేళ ఆరు రాష్ట్రాల్లో విస్తరించిన ప్రాంతంను ప్రకటించిన కేంద్రం
వయనాడ్లో విషాదం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో దాదాపు 56వేల చదరపు కిలోమీటర్ల పరిధిని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ ఐదో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
కేరళ వయనాడ్లోని కొండచరియలు విరిగిపడిన 13 గ్రామాలు సహా మొత్తం 9వేల 993 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు, గుజరాత్ల్లోని పర్యావరణ సున్నిత ప్రాంతాలు దీని కిందకు వస్తుందని తెలిపింది. ఈ ముసాయిదా ప్రకారం ఆయా ప్రాంతాల్లో మైనింగ్, క్వారీ, ఇసుక తవ్వకాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు జరుగుతుంటే వచ్చే ఐదేళ్లలో దశల వారీగా వాటికి ముగింపు పలుకుతారు. నోటిఫికేషన్పై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్రం కోరింది. కేరళలో ఒకే ప్రాంతంలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. శుక్రవారం వయనాడ్ జిల్లా యంత్రాంగంతో ఆయన సమావేశమయ్యాను.
ఆ ప్రాంతంలో జరిగిన ప్రాణ, ఆర్థిక నష్టం గురించి అధికారులు రాహుల్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బాధితులకు 100 ఇళ్లు నిర్మించాలని అనుకుంటున్నా. మిగతా ఘటనల వాటి మాదిరిగా కాకుండా దీనిని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అలాగే ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా’ అని తెలిపారు.
వాయనాడ్ జిల్లాను కుదిపివేసిన కొండచరియల దుర్ఘటనల్లో కనీసం 49 మంది పిల్లలు గల్లంతు కావడం లేదా మరణించడం జరిగిందని కేరళ సార్వత్రిక విద్యా శాఖ మంత్రి వి శివన్కుట్టి వెల్లడించారు. వెల్లరిమలలో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రకృతి వైపరీత్యానికి పూర్తిగా ధ్వంసమైందని, ఆ పరిసరాల్లోని మరి నాలుగు పాఠశాలలు పెద్ద లేదా చిన్న నష్టానికి గురయ్యాయని తెలిపారు.
ప్రాణాలతో బయటపడ్డ పిల్లల్లో అనేక మంది పాఠ్యపుస్తకాలు, సర్టిఫికేట్లు కోల్పోయారని, ప్రభుత్వం వీటన్నిటినీ పరిశీలించి, ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత వారికి సాయం చేస్తుందని ఆయన చెప్పారు.
మరోవైపు ఈ ఘటనలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్ పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వీరంతా సహాయక శిబిరాలు, ఆస్పత్రుల్లో ఉన్న బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణీలకు, చిన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఫోన్ ద్వారా కూడా నిపుణులతో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం 24 గంటలు పాటు అందుబాటులో ఉండేలా 14416 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం