సరిహద్దు ఉగ్రవాద శిబిరాలకు పాక్ నిధులు!

సరిహద్దు ఉగ్రవాద శిబిరాలకు పాక్ నిధులు!
 
* భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య దోడాలో కాల్పులు
 

పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో  సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తేలింది. జూలై 16న కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందారు.

కతువా జిల్లాలోని రిమోట్ మాచెడి అటవీ ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్‌ వాహనంపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఆగ్రహించిన భారత ఆర్మీ వారి మూలాలను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో పాక్ నిధుల వ్యవహారం బయటకి వచ్చింది.

శిక్షణ పొందిన ఉగ్రవాదులను, మాజీ ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్) సభ్యులు, కిరాయి సైనికులకు పాకిస్థాన్ ఒక్కో గ్రూపునకు కనీసం రూ.లక్ష ఇచ్చి భారత్‌కు పంపుతోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఈ ఉగ్రవాదులకు ఎం4 రైఫిల్స్, చైనీస్ కవచాలను ఛేదించే బుల్లెట్ల వంటి ఖరీదైన ఆయుధాలను సమకూర్చుతోంది. 

చొరబాటు సమయంలో వారికి సహాయపడే వారికి రూ.10 వేల నుండి రూ.50 వేల వరకు చెల్లింస్తున్నారు. ఉగ్రవాదులు ఐకామ్ రేడియో సెట్ల ద్వారా సామ్ సుంగ్  ఫోన్‌లు, వై ఎస్ఎంఎస్ లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు భారతలోకి చొరబడటానికి అంతర్జాతీయ సరిహద్దు లేదా ఇతర మార్గాలను ఉపయోగించుకున్నారు. 

బిఎస్ఎఫ్ అన్ని కంచెలు, సొరంగాలను తనిఖీ చేస్తోంది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం, ఇతర అవసరాలకు సహాయం చేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు రూ.5 వేలు-6 వేల వరకు అందజేస్తున్నట్లు తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయంతో దాయాది దేశంలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారట.

పాకిస్థాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యువతను ఉగ్రదాడులవైపు పూర్తిగా మళ్లించడంలో విఫలమైన పాక్.. ఇప్పుడు వారికి డబ్బు ఎరగా వేసి ఆకర్షించే పనిలో పడింది.

మరోవంక, జ‌మ్మూక‌శ్మీర్‌ లోని దోడా జిల్లాలో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య తాజాగా మరోసారి కాల్పులు చెలరేగాయి.  కేవ‌లం 4 గంట‌ల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. కొంద‌రు అనుమానాస్ప‌దంగా సంచ‌రిస్తున్న నేప‌థ్యంలో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా కాల్పులకు పాల్ప‌డ్డారు. గాండో ఏరియా నుంచి రెండు పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
మంగ‌ళ‌వారం రాత్రి 10.45 నిమిషాల‌కు తొలుత క‌లాన్ భాటా ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ త‌ర్వాత తెల్ల‌వారుజామున రెండు గంట‌ల‌కు పంచాన్ భాటాలో మ‌రోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. దేసా అటవీ ప్రాంతంలో ప్ర‌స్తుతం ఉగ్ర‌వాద వ్య‌తిరేక ఆపరేష‌న్ కొన‌సాగుతోంది. సోమ‌వారం ఈ ప్రాంతంలో జ‌రిగిన కాల్పుల్లో న‌లుగు భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు.

తాజాగా జ‌రిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. చీక‌ట్లో ఉగ్ర‌వాదులు త‌ప్పించుకున్న‌ట్లు అధికారులు చెప్పారు. దేసా అటవీ ప్రాంతంలో ఉన్న ధారి గోటే ఉరార్‌బాగి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్‌, స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ గ్రూప్‌కు చెందిన ద‌ళాలు సెర్చ్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయి. 

చాలా క‌ఠిన‌మైన కొండ ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులతో ఉగ్ర‌వాదుల ఏరివేత స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. సోమ‌వారం దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌కు పాక్‌కు చెందిన జైషే మ‌హ‌మ్మ‌ద్‌తో లింకు ఉన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు.

సోమ‌వారం కాల్పుల్లో మరణించిన వాళ్లలో డార్జిలింగ్‌కు చెందిన కెప్టెన్‌ బ్రిజేశ్‌ థాపా, ఏపీకి చెందిన నాయక్‌ డీ రాజేశ్‌, రాజస్థాన్‌కు చెందిన సిపాయిలు బిజేంద్ర, అజయ్‌ కుమార్‌ సింగ్‌ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్‌ సంస్థకు షాడో గ్రూపు ‘ది కశ్మీర్‌ టైగర్స్‌’ ప్రకటించింది.