రుణమాఫీ జిఓ రైతులను నమ్మించి గొంతు కోయటమే!

రుణమాఫీ జిఓ రైతులను నమ్మించి గొంతు కోయటమే!
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలు కాలయాపన చేసి రెండు లక్షల వ్యవసాయ రుణమాఫీ హామీ విషయంలో రేవంత్ సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 567 రైతులను నమ్మించి గొంతు కోసే విధంగా ఉన్నదని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. 

 రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో జారీచేసిన మార్గదర్శకాలు  మార్గదర్శకాలు కావని దుర్మార్గ దర్శకాలని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు షరతుల పేరుతో రైతులను మోసం చేస్తే బిజెపి కిసాన్ మోర్చా ఉపేక్షించదని ఆయన స్పష్టం చేశారు. 

వరంగల్ డిక్లరేషన్ పేరిట మీరు రైతులకు ఇచ్చిన హామీలను తుక్కుగూడ బహిరంగ సభలో మీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాల నుండి పారిపోతున్నారా? అనే శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.  ప్రభుత్వం జారీచేసిన జీవో కు మంత్రులు మాట్లాడేదానికి పొంతన లేకుండా ఉందని ధ్వజమెత్తారు. 

 ఆరోగ్య భద్రత కార్డు ప్రామాణికమని జీవో చెపుతుంటే కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు అని మంత్రులు మాట్లాడుతున్నారని శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2018కి పూర్వం బకాయిలను పరిగణలోకి తీసుకోమని రీ షెడ్యూల్ రుణాలకు రుణమాఫీ వర్తించదని బంగారంతో తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయమని, ఇలా అనేక రకాల ఆంక్షలు విధిస్తూ లబ్ధిదారులను కుదించే కుట్రలు రేవంత్ సర్కారు చేస్తున్నదని ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వని విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా? అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. రుణమాఫీ జీవోను వెంటనే సమీక్షించి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయని పక్షంలో ఈ సర్కారు చేతిలో మోసపోయిన రైతులను సమీకరించి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు కిసాన్ మోర్చా దిగుతుందని కొండపల్లి  హెచ్చరించారు.