ఏపీలో కొత్తగా మరో ఐదు ఎయిర్ పోర్టులు

ఏపీలో కొత్తగా మరో ఐదు ఎయిర్ పోర్టులు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా మరో 5-6 ఎయిర్‌పోర్టులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  భోగాపురం విమానాశ్రయంతోపాటు దొనకొండ, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌ వద్ద విమానాశ్రయాలు నిర్మిస్తామని వెల్లడించారు.  భోగాపురం విమానాశ్రయం పనులు పరిశీలించిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఈ ఎయిర్‌పోర్టు చాలా కీలకంగా మారుతుందని, భవిష్యత్‌లో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని స్పష్టం చేశారు.

కాకినాడ – అమలాపురం మధ్య మరో విమానాశ్రయం రానున్నట్లు తెలిపారు. ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి 800 నుంచి వెయ్యి ఎకరాల వరకు అవసరమవుతుందని అధికారులు తెలుపగా, వెంటనే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  జాతీయ రహదారుల తరహాలో పీపీపీ మోడళ్లలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.

వయోబిల్టి గ్యాప్‌ ఫండింగ్‌ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. 2026 జూన్ నాటికి భోగాపురం పూర్తవుతుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు అంటున్నారని, తాను ఇంకా ముందే పూర్తి చేయమంటున్నానని సీఎం తెలిపారు. 

2026 జూన్ 30న వచ్చి దీనిని ఆపరేషన్ చేయాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అందుకే జిల్లాల పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకే వచ్చానని తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్‌ రోడ్డు కూడా నిర్మిస్తామన్న ఆయన, అటు శ్రీకాకుళం నుంచి భోగాపురం వరకు కూడా బీచ్‌రోడ్డు వస్తుందని పేర్కొన్నారు. 

ఇప్పుడు ఉన్న జాతీయ రహదారికి, ఈ బీచ్‌రోడ్డుకు మధ్య ఉన్న ప్రాంతం మొత్తం ఇండస్ట్రీయల్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని, దానితో  ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని సీఎం తెలిపారు. ఇది ఎన్నో ఏళ్లనాటి తన కలని చెప్పుకొచ్చారు.

విమానాశ్రయ పనుల పరిశీలన అనంతరం సీఎం, పనుల పురోగతి, చేప్టటాల్సిన పనులు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై జీఎమ్మార్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2023 నాటికే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావాల్సి ఉన్నా గత ప్రభుత్వ వైఖరి వల్ల సాధ్యపడలేదని విచారం వ్యక్తం చేశారు. విశాఖకు మెట్రో కూడా వస్తుందని, దీన్ని విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు.