తెలుగు రాష్ట్రాల మంత్రులకు కీలక శాఖలు

కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐదుగురికీ సోమవారం కీలక శాఖలను కేటాయించారు. సికింద్రాబాద్ ఎంపి కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదాలో అత్యంత కీలకమైన బొగ్గు, గనుల శాఖలను కేటాయించారు. అలాగే తొలిసారి కేంద్రమంత్రివర్గంలో అడుగుపెట్టిన టిడిపి ఎం పి రామ్మోహన్ నాయుడుకు కూడా కేబినెట్ హోదా దక్కింది.  ఆయనకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పదవిని కేటాయించారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బండి సంజయ్ కుమార్‌కు కేంద్ర హోం సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.  బిజెపి తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కూడా కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించగా ఆయనకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవిని కేటాయించారు.

ఆయా శాఖల కేటాయింపు చూస్తే ఐదుగురికి కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ మోదీ  ప్రాముఖ్యత కలిగిన శాఖలను అప్పగించారు. వీటిలో కిషన్‌రెడ్డి ఇప్పటి వరకు కేంద్ర టూరిజం, పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 

ఈసారి మోడీ 3.0 కేబినెట్‌లో బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖను అప్పగించారు.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు వనరుల సద్వినియోగం, విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల, కొత్త ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల అవసరం తీర్చేందుకు వీలుగా కిషన్‌రెడ్డికి ఎంతో ముందు చూపుతో ఈ పదవిని ప్రధాని అప్పగించారు. 

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రామ్మోహన్‌నాయుడు నూతన మంత్రివర్గంలోని అందరికన్నా చిన్న వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 36 ఏండ్ల ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పౌర విమానయాన శాఖ మంత్రి పదవిని అప్పగించారు. ఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు ఇతర విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణ వంటివి చాలా పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. 

వాటిని పరిష్కరించుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించినంత వరకు విమానాల రాకపోకలు, వాటి సంఖ్య పెంచుకునేందుకు తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాస్ వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేటాయించడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అంటున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వివాదం కొనసాగుతుండగా, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను సమన్వయం చేసుకునేందుకు కూడా దోహదపడుతుందని భావించిన కేంద్రం వర్మకు ఈ ఫోర్ట్‌ఫోలియోను కేటాయించిందని పలువురు పేర్కొంటున్నారు. 

ఇక డాక్టర్ వృత్తిని నిర్వహిస్తూ విదేశాల్లో వైద్యరంగంలో స్థిరపడి సొంత ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లో దిగిన టిడిపి ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంటు సభ్యుడిగా ఏకంగా గెలిచి తొలిసారే మంత్రి పదవిని దక్కించుకున్నారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పదవిని ఆయకు అప్పగించారు. 

ఈ ఫోర్ట్‌ఫోలియో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుంది. కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ అవసరాలు తీర్చుకునేందుకు పలు ప్రాజెక్టులు మంజూరు చేయించుకునే వీలుంటుంది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులకు కేటాయిచిన శాఖలు చాలా కీలకమైనవిగా భావించాల్సి ఉంది.