ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని  ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులు మంగళవారం చంద్రబాబును శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
 

ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో చాలా ఎన్నికలు చూశానని, రాష్ట్ర ,చరిత్రలో ఎప్పుడు చూడని తీర్పును ప్రజలు ఇచ్చారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలకు శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్త్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరి, మూడు పార్టీల ఎమ్యెల్యేలు పాల్గొన్నారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని  ప్రచారం చేశామని, ఎన్నికల్లో ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన శాసనసభ్యులపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. కూటమిలు ఏర్పాటు తర్వాత ఎలాంటి ఫిర్యాదులు లేకుండా జరిగిన ఎన్నికలు ఇవేనని చంద్రబాబు చెబుతూ  నూటికి నూరు శాతం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజల మనోభావానికి అనుగుణంగా మూడు పార్టీల కార్యకర్తలు పనిచేశారని చెబుతూ మూడు పార్టీల కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందించారు. 1994లో  ఏకపక్ష ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు, ఓట్లు రాలేదని గుర్తు చేశారు. 175లో 164గెలిచామని, 11మాత్రమే ఓడిపోయామని, స్ట్రైకింగ్ రేట్ 93శాతం ఉందన్నారు. ఓట్లు కూడా 57శాతం  వచ్చాయని, 50శాతం వస్తే చాలా ఎక్కువని భావిస్తామని, అంతకంటే రెట్టింపు వచ్చాయని చెప్పారు.

 
జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పదిలో ఎనిమిది గెలిచిందని పేర్కొంటూ అభ్యర్థులు గట్టిగా నిలబడిన ప్రతిచోట  విజయం సాధించారని చెప్పారు. ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపించారని చంద్రబాబు తెలిపారు.  రాష్ట్రంలో ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో తమను అంతా గౌరవించారని  చంద్రబాబు చెప్పారు. 
 

పవన్ సమయస్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోలేనని చెబుతూ  జైల్లో ఉన్నపుడు వచ్చి తనను పరామర్శించారని, బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని అంతకు ముందు  ప్రకటించినా, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్టు జైలు బయట ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీ,జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఆ ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేశారని కొనియాడారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారని తెలిపారు.

ఓటు బదిలీపై తమకు మొదట్లో అనుమానాలు ఉండేవని, కొవ్వూరులో మూడు పార్టీలు కలిసి ప్రచారం చేశామని, ఆరు జిల్లాల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేశామని చెప్పారు. అనంతపురంలో అమిత్‌ షా ధర్మవరం ప్రచారానికి వచ్చారని చెప్పారు.

ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఎన్నిక, మూడు పార్టీల మధ్య సమన్వయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని, గత ఐదేళ్లలో సాగిన విధ్వంసకర పాలన, కక్ష పూరిత పాలన సాగిందని పురంధేశ్వరి తెలిపారు. ప్రజలు విసిగి వేసారి ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించారని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని భావించినా ఇంత ఘన విజయాన్ని ఊహించలేదని ఆమె చెప్పారు.