ఎంపీల్లో 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు

* కొత్త‌గా ఎన్నికైన 280 మంది ఎంపీలు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో.. సుమారు 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్నారు. ఈ విష‌యాన్ని అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్‌(ఏడీఆర్) సంస్థ తెలిపింది. 

దిగువ స‌భ‌కు ఎన్నికైన అభ్య‌ర్థుల్లో ఎక్కువ సంఖ్య‌లో క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌వారు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. 233 మంది ఎంపీలు త‌మ‌పై కేసులు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే 2014లో 185 మంది, 2009లో 162 మంది, 2004లో 125 మంది త‌మ‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 2009 నుంచి క్రిమిన‌ల్ కేసులు ఉన్న ఎంపీల సంఖ్య 55 శాతం పెరిగిన‌ట్లు ఏడీఆర్ డేటా పేర్కొన్న‌ది.

ఈ ఏడాది గెలిచిన 251 మందిలో 170 మంది ఎంపీల‌పై తీవ్ర‌మైన నేరం కేసులు ఉన్నాయి. రేప్, మ‌ర్డ‌ర్‌, హ‌త్యాయ‌త్నం, కిడ్నాప్‌, మ‌హిళ‌ల‌పై నేరాలు ఉన్న‌ట్లు ఏడీఆర్ తెలిపింది. 2019లో 159 ఎంపీల‌పై ఆ కేసులు ఉండేవి. 2009 నుంచి సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్న ఎంపీల సంఖ్య 124 శాతం పెరిగిన‌ట్లు ఏడీఆర్ త‌న నివేదిక‌లో తెలిపింది. 

27 మంది ఎంపీలు త‌మ‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల నుంచి నిర్దోషులుగా తేలిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఐపీసీలోని సెక్ష‌న్ 302 కింద మ‌ర్డ‌ర్ కేసు బుక్ అయిన‌ట్లు న‌లుగురు ఎంపీలు పేర్కొన్నారు. ఐపీసీలోని 307 సెక్ష‌న్ కింద 27 హ‌త్యాయ‌త్నం కేసులు ఉన్న‌ట్లు తెలిపారు.

మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డిన వారు 15 మంది ఉన్నారు. ఇద్ద‌రిపై ఐపీసీ 376 సెక్ష‌న్ కింద రేప్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. న‌లుగురిపై కిడ్నాప్ కేసులు, విద్వేష ప్ర‌సంగాల‌కు చెందిన 43 కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. 2024 ఎన్నిక‌ల్లో క్రిమిన‌ల్ కేసులు ఉన్న వారిలో నెగ్గిన శాతం 15.3 శాతంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ 240 సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఆవిర్భించిన ఆ పార్టీలో 94 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌లో 49 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు ఏడీఆర్ తెలిపింది. 37 సీట్లు గెలిచిన ఎస్పీలో 21 మందిపై క్రిమిన‌ల్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

తృణ‌మూల్‌, డీఎంకే పార్టీల్లో 13 శాతం నేర‌స్థులు, టీడీపీలో 8 శాతం నేర‌స్థులు, శివ‌సేన‌లో అయిదు శాతం క్రిమిన‌ల్ కేసులు ఉన్న నేత‌లు ఉన్న‌ట్లు ఏడీఆర్ పేర్కొన్న‌ది. బీజేపీకి చెందిన 63 మంది, కాంగ్రెస్‌కు చెందిన 32 మంది, ఎస్పీకి చెందిన 17 మందిపై సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి.

18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 280 మంది ఎంపీలు కొత్త‌గా క‌నిపించ‌నున్నారు. 2024 ఎన్నిక‌ల్లో తొలిసారి 280 మంది ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. 2019లో ఆ సంఖ్య 267గా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. తాజా ఎన్నిక‌ల్లో ఎన్నికైన వారిలో 263 మంది గ‌తంలోనూ ఎంపీలుగా చేశారు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీస‌ర్చ్ సంస్థ ఈ డేటాను ఇచ్చింది. 

మ‌ళ్లీ ఎన్నికైన ఎంపీల్ 8 మంది త‌మ నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకున్నారు. ఒక‌రు మాత్రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌య్యారు. 17వ లోక్‌స‌భ‌లో ఓ పార్టీ త‌ర‌పున ఎన్నికైన 9 మంది ఎంపీలు ఈసారి మ‌రో పార్టీ గుర్తుపై మ‌ళ్లీ ఎంపీలుగా ఎన్నిక‌య్యారు.  53 మంత్రులు పోటీ చేయ‌గా, దాంట్లో 35 మంది మాత్ర‌మే ఎన్నిక‌య్యారు. 18వ లోక్‌స‌భ‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భ‌వించింది. ఆ పార్టీ 240 సీట్లు గెలుచుకున్న‌ది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ది. ఆ పార్టీకి 99 సీట్లు వ‌చ్చాయి. స‌మాజ్‌వాదీ పార్టీ 37 సీట్ల‌తో మూడ‌వ స్థానంలో ఉన్న‌ది.

66 శాతం జాతీయ పార్టీల సభ్యులే

గత ఎన్నికలతో పోలిస్తే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. తాజా ఎన్నికలలో 41 రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు గెలుపొందగా గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఐదు పెరిగింది. 2019 ఎన్నికలలో 36 రాజకీయ పార్గీల సభ్యులు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు.

ఎడిఆర్ అధ్యయనం ప్రకారం 346 సీట్లను(64 శాతం) జాతీయ పార్టీలు గెలుచుకోగా 179 స్థానాలను(33 శాతం) రాష్ట్ర స్థాయి పార్టీలు గెలుచుకున్నాయి. 11 సీట్లను గుర్తింపు పొందని పార్టీలు గెలుచుకోగా 7 స్థానాలలో ఇండిపెండెంట్లు గెలుపొందారు. 2009 నుంచి 2024 వరకు చూస్తే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. 

2024 ఎన్నికలలో 751 పార్టీలు పాల్గొనగా 2019లో 677, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికలలో పాల్గొన్నాయి. తాజా ఎన్నికలలో జాతీయ పార్టీల నుంచి 1,333 మంది అభ్యర్థులు, రాష్ట్ర పార్టీల నుంచి 532 మంది, గుర్తింపు పొందని పార్టీల నుంచి 2,580 మంది, స్వతంత్ర అభ్యర్థులు 3,915 మంది పోటీ చేశారు.