9న మోదీ ప్రమాణ స్వీకారం.. దక్షిణాసియా అగ్రనేతలకు ఆహ్వానం

9న మోదీ ప్రమాణ స్వీకారం.. దక్షిణాసియా అగ్రనేతలకు ఆహ్వానం
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మరోసారి కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.  ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో  సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మారినట్లు సమాచారం.
దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని మోదీ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు. 
మరోవైపు ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను  కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం.  బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ దేశాధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.  ఇక శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఇప్పటికే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

మోదీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు శ్రీలంక అధ్యక్ష కార్యాలయ మీడియా విభాగం తెలిపింది. శనివారం జరగనున్న కార్యక్రమానికి తమ అధ్యక్షుడు విక్రమసింఘే హాజరుకానున్నట్లు తెలిపింది. ఈ మేరకు విజయంపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.  ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని మోదీ విజయం సాధించినందుకు 75 దేశాల ప్రతినిధుల నుంచి అభినందనలు వచ్చాయి.

మరోవైపు బంగ్లాదేశ్‌  ప్రధాని షేక్‌ హసీనాతోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ సందర్భంగా మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని హసీనాను ఆహ్వానించారని, అందుకు ఆమె అంగీకరించారని దౌత్య వర్గాలు తెలిపాయి.

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేపాల్(nepal) ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’, భూటాన్(bhutan) ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లను కూడా ఆహ్వానించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నరేంద్ర మోదీ కూడా ‘ప్రచండ’తో ఫోన్‌లో మాట్లాడారు. అధికారికంగా గురువారం ఆహ్వానాలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, సురక్షితంగా మార్చేందుకు భారత్‌తో కలిసి అమెరికా కృషి చేస్తుందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ప్రజల-ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి విదేశాంగ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఇక ప్రధానిగా మోదీ తొలి ప్రమాణ స్వీకారోత్సవానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) నేతలు హాజరయ్యారు. 2019లో నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి ప్రధాని అయినప్పుడు, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్‌టెక్ దేశాల నేతలు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి నేతల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.