కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.2 లక్షల కోట్ల డివిడెండ్

కేంద్ర ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్లు చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చెల్లించిన డివిడెండ్తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది. గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో డివిడెండ్ చెల్లింపు నిర్ణయాన్ని తీసుకున్నారు.

 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2,10,874 కోట్ల డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి బోర్డు ఆమోదించిందని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్బీఐ కేంద్రానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ను చెల్లించింది.

 2018-19లో రూ.1.76 లక్షల కోట్లు డివిడెండ్ చెల్లించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను భారీ మొత్తంలో రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించడం వల్ల గత రికార్డు బద్దలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు, రాబడి మధ్య అంతరాన్ని రూ.17.34 లక్షల కోట్లకు (దేశ జీడీపీలో 5.1 శాతం) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని రూ.1.02 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ భారీ డివిడెండ్ కు ఆమోదం తెలపడం గమనార్హం.