డా. సునీత నర్రెడ్డికి అరుదైన గుర్తింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, అపోలో హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి అరుదైన ఘనత సాధించారు. డాక్టర్ సునీత ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడిఎస్‌ఎ) ఫెలోగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐడిఎస్‌ఎ ప్రకటించింది. ఈ గౌరవపద్రమైన గుర్తింపు అంటు వ్యాధుల రంగంలో డాక్టర్ సునీత విశేషమైన కృషికి, అంకితభావానికి నిదర్శనమని ఐడిఎస్‌ఎ పేర్కొంది. 

ఐడిఎస్‌ఎ ఫెలోషిప్ అనేది అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ప్రతిష్టాత్మకమైన గౌరవం. డాక్టర్ సునీత నర్రెడ్డి నైపుణ్యం, అంటు వ్యాధులపై అవగాహ నివారణ, చికిత్సను అభివృద్ధి చేయడంలో నిబద్ధత తదితర అంశాలు ఆమెకు ఈ ఫెలోషిప్‌ను అందుకోవడంలో దోహదపడ్డాయి.

సునీ నర్రెడ్డి అంకితభావం, నాయకత్వం, నైపుణ్యం, రోగుల సంరక్షణ ఐడిఎస్‌ఎ సంస్థకు ఎంతో దోహదపడతాయని ఆ సంస్థ అధ్యక్షుడు స్టీవెన్ కె స్మిత్ పేర్కొన్నారు. ఐడిఎస్‌ఎ ఫెలోషిప్ దక్కినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ సునీత నర్రెడ్డి తెలిపారు. ఈ గుర్తింపు అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి , ఆరోగ్య సంరక్షణ పట్ల తన నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 

ఐడిఎస్‌ఎ ద్వారా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పొందినందుకు డాక్టర్ సునీత నర్రెడ్డిని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి అభినందించారు. అంటు వ్యాధుల రంగంలో అభివృద్ధి చేయడంలో ఆమె అలుపెరగని అంకితభావం, ఆరోగ్య సంరక్షణలో నిబద్ధత అపోలో హాస్పిటల్స్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.