![](https://nijamtoday.com/wp-content/uploads/2024/05/Madhavi-Latha-vote.webp)
పోలింగ్ స్టేషన్లోకి చొరబడి కొంతమంది ముస్లిం మహిళా ఓటర్లను బురఖా తొలగించి వారి గుర్తింపును వెల్లడించమని కోరారంటూ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కె. మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్పేట పోలీసులు మాధవి లతపై సెక్షన్ 171 సి, 186 కింద కేసు నమోదు చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132తో పాటు, ఐపీసీ 505 (1)(సి) విధులను నిర్వర్తించకుండా ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదైంది. మహిళా ఓటర్లు తమ గుర్తింపును వెల్లడించేందుకు బురఖాను తొలగించాలని మాధవి లత కోరిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. మహిళా ఓటర్ల ముఖాలు వారి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ లోని చిత్రాలను సరిపోల్చాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయని, అందుకే వాటిని సరిచూసేందుకు అక్కడికి వచ్చానని మాధవి లత ఆరోపించారు.
ఈ వీడియో గురించి మాధవి లతా మాట్లాడుతూ, మహిళల గుర్తింపును ధృవీకరించమని మాత్రమే తాను అభ్యర్థించానని, ఇందులో తప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు. “నేను అభ్యర్థిని. చట్టప్రకారం ముఖానికి మాస్క్లు లేకుండా ఐడి కార్డులను తనిఖీ చేసే హక్కు అభ్యర్థిని కలిగి ఉంది. నేను పురుషుడిని కాదు, నేను మహిళను. చాలా వినయంతో నేను వారిని అభ్యర్థించాను. దయచేసి నేను చూడగలనా? ఐడీ కార్డులతో వెరిఫై చేస్తారా? అని అడిగాను” అని తెలిపారు.
అంతకుముందు, మాధవి లత తన నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తేడాలు ఉన్నాయని ఆరోపించారు. “పోలీసు సిబ్బంది చాలా నిస్తేజంగా కనిపిస్తున్నారు, చురుగ్గా లేరు.. ఏమీ తనిఖీ చేయడం లేదు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడకు వస్తున్నారు. కానీ వారి పేర్లు జాబితా నుండి తొలగించఉన్నాయి. వారిలో కొందరు గోషామహల్ వాసులు అయితే వారి పేర్లు రంగారెడ్డి జాబితాలో ఉన్నాయి” అంటూ ఆమె పేర్కొన్నారు.
“నేను వారి గుర్తింపును వెల్లడించమని మాత్రమే వారిని అభ్యర్థించాను. ఎవరైనా దానిని పెద్ద సమస్యగా చేస్తే, వారు తమ అక్రమాలను బహిర్గతం చేస్తారనే భయంతో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బోగస్ పోలింగ్ జరిగింది. మరణించిన వ్యక్తుల ఓట్లు కూడా పోల్ అవుతున్నాయి. అజంపురా, గోషామహల్లో పోలింగ్ అక్రమాలపై భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాను” అని బీజేపీ అభ్యర్థి మాధవి లత స్పష్టం చేశారు.
కాగా, ముస్లిం మహిళా ఓటర్లు తమ గుర్తింపును వెల్లడించడానికి వారి బురఖాలను తొలగించమని కోరినందుకు మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ ట్వీట్ చేశారు.
More Stories
ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నారా!
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్
ఆసియాకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్, శ్రీలంక