ఇంటర్నేషనల్ టివిపై తాలిబన్ల నిషేధం

అప్ఘానిస్తాన్ ఇంటర్నేషనల్ టివితో మాట్లాడవద్దని జర్నలిస్టులు, నిపుణులను తాలిబన్ గురువారం హెచ్చరించింది. ఒక మీడియా సంస్థకు సహకరించవద్దని తాలిబన్లు ఆదేశించడం ఇదే మొదటిసారి. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అఫ్ఘానిస్తాన్ ఇంటర్నేషనల్ టివి శాటిలైట్, కేబుల్, సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంది.

ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ టివి వృత్తిపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతోందని, నైతిక, చట్టపరమైన హద్దులను అతిక్రమిస్తోందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను నియంత్రిస్తున్న తాలిబన్‌కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అఫ్ఘాన్‌లోని జర్నలిస్టులు, నిపుణులు ఈ టివి స్టేషన్‌కు సహకరించరాదని మీడియా ఉల్లంఘనల కమిషన్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

టివి స్టేషన్ చర్చలో పాల్గొనడం, బహిరంగ ప్రదేశాలలో ఆ టివి కార్యక్రమాలను ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ బుధవారం జరిగిన కమిషన్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిధి హబీబ్ ఘోఫ్రాన్ తెలిపారు. ఆ టివి స్టేషన్‌కు సహకరించిన జర్నలిస్టులు, నిపుణులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆయన వివరించలేదు.

కాగా, తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ చానల్‌పై ఎటువంటి ప్రభావం చూపబోదని, తమకు ఆ దేశంలో ఉద్యోగులు కాని, ఫ్రీలాన్సర్లు కాని ఎవ్వరూ  లేరని ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ టివి డైరెక్టర్ హరున్ నజఫీజాదా తెలిపారు. ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛ కు విఘాతం కలిగిస్తుందని నజఫీజాదా తెలిపారు. పత్రికా స్వేచ్ఛలో ఆఫ్ఘనిస్తాన్ స్థానం అట్టడుగున ఉంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఇచ్చిన తాజా సూచి ప్రకారం పత్రికా స్వేచ్ఛలో అఫ్గాన్ ప్రపంచంలోని 180 దేశాలలో 178 ర్యాంకులో ఉంది. గత ఏడాది అఫ్ఘాన్ 152 ర్యాంకును సాధించింది.

ఈ టివిపై విధించిన ఆంక్షలను తాలిబన్లు వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే) డిమాండ్ చేసింది. ఆఫ్గనిస్తాన్ లో స్వతంత్రంగా పనిచేసే మీడియాలపై ఆంక్షల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ మీడియాపై, విదేశాల నుండి పనిచేస్తున్న మీడియా సంస్థలపై కఠినమైన సెన్సార్షిప్ విధించేందుకు మీడియా ఫిర్యాదుల, హక్కుల ఉల్లంఘనల కమిషన్ ను ఉపయోగించుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సమాచార స్వేచ్ఛపై ఆంక్షలను వెంటనే తొలగించాలని కోరింది.