ఏ రూపంలోనైనా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లో కోత విధించి మతపరమైన రిజర్వేషన్ కేటాయించాలనే కాంగ్రెస్, ఎస్పీ, ఇండియా కూటమి అజెండాను దేశ ప్రజలు ఆమోదించబోరని ఆయన తేల్చి చెప్పారు.
గోరక్నాథ్ ఆలయ ప్రాంగణంలో యోగి ఆదిత్యానాథ్ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు బీజేపీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను అణిచివేస్తూ ఎమర్జన్సీ చీకటిరోజులను దేశంపై రుద్దిన విషయం మరువరాదని యోగి ఆదిత్యానాథ్ గుర్తుచేశారు.
“బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే కాంగ్రెస్ చరిత్ర. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడానికి కాంగ్రెస్ నిరంతరం కృషి చేసింది” అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేకం అని చెబుతూ అదెప్పుడూ ప్రజల మనోభావాలను గౌరవించే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు.
యూపీఏ హయాంలో కాంగ్రెస్ చేసిన పాపాలను ప్రజలు ఇంకా మరువలేదని చెప్పారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో ఎస్పీ, బీఎస్సీలు భాగస్వామ్య పక్షాలుగా కాంగ్రెస్ పాపాల్లో పాలుపంచుకున్నాయని గుర్తుచేశారు. ఓబీసీల కోటా 27 శాతంలో కోత విధించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 6 శాతం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఓ వర్గానికి కట్టబెట్టిందని ఆదిత్యనాథ్ విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లో సచార్ కమిటీ సాకుతో కొన్ని ముస్లిం కులాలకు సదరు కోటాలో వాటా కల్పిస్తూ వారిని ఆ కేటగిరీలో చేర్చిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మతప్రాతిపదికన రిజర్వేషన్లతో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ కోత విధించిందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకత్వం “పూర్తి వైఫల్యం” అని నిరూపించబడిందని కూడా ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. “కాంగ్రెస్ సభ్యులకు కూడా వారి నాయకత్వంపై నమ్మకం లేదు. కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల పోటీల నుండి వైదొలగడం, రాష్ట్ర యూనిట్ల ముఖ్యులు రాజీనామా చేయడం, కొన్ని చోట్ల, ప్రకటించిన అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడం, బిజెపి సభ్యత్వం తీసుకోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అని ఆయన గుర్తు చేశారు.
ఫలితంగా, నిరాశలో, మిగిలిన కాంగ్రెస్ నాయకులు నిరాధారమైన, కల్పిత ఆరోపణలను ఆశ్రయిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు.
More Stories
48 గంటల్లో సిట్ ముందు లొంగిపో.. ప్రజ్వల్కు హితవు
ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!